టి 20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో భారత్

టి 20 తాజా ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది ఐసిసి. తాజాగా సిరీస్‌ గెలిచిన భారత్‌ 268 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ 7 పాయింట్లు వెనకబడిపోయి తర్వాతిస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ గెలిచి ఉత్సాహం మీద ఉంది టీమ్‌ ఇండియా.  కిందటి ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే భారత్ ఒకే ఒక పాయింట్ ఆధిక్యంలో నిలిచింది. ఈసారి మాత్రం ఇంగ్లండ్‌పై ఏడు పాయింట్ల ఆధిక్యాన్ని అందుకుంది. ఇక పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ రెండు మ్యాచుల్లో ఓటమి పాలుకావడంతో దాని ప్రభావం రేటింగ్ పాయింట్లపై పడింది.

ఇక సౌతాఫ్రికా, పాకిస్థాన్‌లు చెరో 258 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే ఆడిన మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకుని సౌతాఫ్రికాకు మూడో ర్యాంక్‌ను కేటాయించాడు. ఇక పాకిస్థాన్‌కు నాలుగో ర్యాంక్ లభించింది.  న్యూజిలాండ్ 252 పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.  ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా మాత్రం 250 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. ఇక వెస్టిండీస్ ఏడో, శ్రీలంక 8వ ర్యాంక్‌లో నిలిచాయి. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ 9, 10 ర్యాంక్‌లను సొంతం చేసుకున్నాయి.

మరోవైపు ప్లేయర్స్ ర్యాంకింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. రిజ్వాన్ ప్రస్తుతం 825 పాయింట్లతో టాప్ రాంక్‌లో నిలిచాడు. ఐడెన్ మార్‌క్రామ్ (సౌతాఫ్రికా) 792 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.

ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచిన భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. సూర్యకుమార్ 780 పాయింట్లతో టాప్3లో చోటు సంపాదించాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు.