టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, అంటూ ఈ పాలనకు త్వరలో చెక్ పడతామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. నోరు తెరిస్తే బూతులు, అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.
ప్రజా సమస్యలను గాలికి వదిలేసి జేబులు నింపుకొనే పనిలో పడ్డారని చెబుతూ రైతుల పక్షపాతి అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మోదీకి భారతదేశ ప్రజలే కుటుంబమని, కేసీఆర్ కు మాత్రం ఆయన కుటుంబ సభ్యులే ముఖ్యమని ఎద్దేవా చేశారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ మణికొండలోని ఓ ఫంక్షన్ హాల్ లో పండిట్ దీన్ దయాళ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పండిట్ దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మణికొండలోని దళిత మోర్చా అధ్యక్షుడు వినోద్ ఇంట్లో అల్పాహారం చేశారు.
ఈ మధ్య అనారోగ్యంతో మరణించిన మణికొండ వార్డు కౌన్సిలర్ వందన నాగేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బండ్లగూడలో ఏర్పాటు చేసిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ బీజేపీ సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్, స్వామి గౌడ్ లతో కలిసి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్
రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ
ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ఎస్ఐబీ చీఫ్ కోసం పిటిషన్