రాజమహేంద్రవరం రూ 3,000 కోట్లతో 8 రహదారులకు గడ్కరీ శంకుస్థాపన

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ  గురువారం రూ. 3,000 కోట్లతో చేపట్టనున్న ఎనిమిది జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రాజమహేంద్రవరం శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, కాకినాడ ప్రత్యేక ఆర్థిక జోన్ (సెజ్), సెజ్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్, కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌లకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అనుసంధానం ఈ ప్రాజెక్టు ద్వారా కలుగుతాయని మంత్రి తెలిపారు.

ఇది బియ్యం, సముద్ర ఆహారాలు, ఆయిల్ మీల్స్, ఐరన్-ఎగుమతులను సులభతరం చేస్తుందన్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఖనిజం, జీవ ఇంధనం, గ్రానైట్ మొదలైనవి ఎగుమతులకు సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కైకరం, మోరంపూడి, ఉండరాజవరం, తేతలి & జొన్నాడ వద్ద 5 ఫ్లైఓవర్‌లను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.

అవి పూర్తయిన తర్వాత నామవరం, శాటిలైట్ సిటీ, మండపేట, రామచంద్రపురం, ఉండరాజవరం, నిడదవోలు, తణుకు పట్టణం, కైకరం, కాకినాడ వంటి ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సురక్షితమైన ప్రయాణాలకు భరోసా ఇస్తామని మంత్రి చెప్పారు. బ్లాక్‌స్పాట్‌లను సరిదిద్దడానికి ప్రత్యేక భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం & సామర్లకోట-అచ్చంపేట జంక్షన్‌లను 4-లేనింగ్‌తో సహా ఇతర 3 ప్రాజెక్టులు, రంపచోడవరం నుండి కొయ్యూరు వరకు 2-లేన్ల నిర్మాణం సామర్లకోట, అన్నవరం బిక్కవోలు, ర్యాలి & పిఠాపురం వంటి పుణ్యక్షేత్రాల వంటి ప్రాంతాలకు రహదారి అనుసంధానం కల్పిస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు.

ఇది అరకు & లంబసింగి వంటి గిరిజన ప్రాంతాలకు మరియు అరకు లోయ & బొర్రా గుహలు వంటి ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు రహదారి అనుసంధానాన్ని కూడా అందిస్తుంది. ఇది కాకినాడ- అల్లూరి సీతారామ జిల్లాల ద్వారా సురక్షితమైన, మెరుగైన, వేగవంతమైన రాష్ట్రాంతర అనుసంధానాన్ని కూడా అందిస్తుంది.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌పంచ స్థాయి మౌలిక స‌దుపాయాలను కల్పించడం కోసం నిబద్దత కలిగి ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ రోజు  ప్రారంభించిన జాతీయ రహదారుల ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి  దాడిశెట్టి రామలింగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.