టిడిపి హయాంలో డేటా చౌర్యం.. తేల్చిన సభా సంఘం

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డేటా చౌర్యం జరిగిన విషయం వాస్తవమేనని శాసనసభా కమిటీ తేల్చింది. ఈ మేరకు రూపొందించిన మధ్యంతర నివేదికను పెగాసెస్‌, స్పైవేర్‌ వ్యవహారంపై ఏర్పాటు చేసిన హౌస్‌ కమిటీ ఛైర్మన్‌ భూమన కరణాకర్‌రెడ్డి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే, సభ్యులకు నివేదిక ప్రతులు ఇవ్వకుండా చదివి వినిపించి, చర్చకు పెట్టడమేమింటూ టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
 
కింజారపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్‌లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెరాక్స్‌ తీయడానికి కూడా నిధుల లేవా? అంటూ ప్రశ్నించారు. ప్రతులు త్వరలోనే అందచేస్తామని స్పీకర్‌ చెప్పినా ఫలితం కనిపించలేదు. టిడిపి సభ్యుల నిరసనల మద్యనే కరుణాకర్‌ రెడ్డి హౌస్‌ కమటి నివేదికను సభలో చదివారు.
 
ఈ ఏడాది మార్చిలో ఏర్పాటైన హౌస్‌ కమిటి నాలుగు పర్యాయాలు సమావేశమయ్యిందని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. సేవామిత్ర అనే యాప్‌ద్వారా తమకు ఓట్లు వేయనివారినిగుర్తించి దాదాపు 30లక్షల ఓట్లను రద్దు చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరించినట్లు తేలిందని చెప్పారు.
 
 2018-19 సంవత్సరంలో ప్రజల ప్రైవేట్‌ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని తెలిపారు. ప్రభుత్వంవద్ద వుండే ప్రజలకు చెందిన డాటాను స్టేట్‌ డాటా సెంటర్‌ నుండి తస్కరించారని, అక్కడి నుండి సేవామిత్రకు బదిలీ చేశారని వివరించారు. ఇది పౌరుల హక్కులకు తీవ్ర భంగం కలిగించడంతో పాటు, సమాచారంను తస్కరించడమనే నేరమని స్పష్టం చేశారు.
 
ఈ డాటా చౌర్యం చేసిన వారిని పట్టుకునేందుకు తాము మరింత లోతుకు వెళ్లి విచారిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ నివేదికను శాసనసభకు నివేదిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం సభ్యులు సభను తప్పుదోవ పట్టించేందుకు గొడవ చేస్తున్నారని, నిబందనల ప్రకారమే శాసనసభలో హౌస్‌ కమిటి నివేదికను ప్రవేశపెట్టారని తెలిపారు.