ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో సృజనాత్మకకు భారీ అవకాశం!

స్వచ్ఛతను, పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించే యత్నంలో తగిన పరిష్కారాలను కనుగొనేందుకు కృషి చేసే స్టార్టప్ సంస్థలకు అన్ని రకాల మద్దతును అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టబడి ఉందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్ పూరి పునరుద్ఘాటిచారు.

స్వచ్ఛతా స్టార్టప్ చాలెంజ్ కార్యక్రమం కింద ఎంపికైన స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి పారుదల వ్యవస్థ, సెఫ్టిక్ ట్యాంకు శుభ్రం చేసే ప్రక్రియలో యాంత్రిక పరిష్కారాలు, ఘన, ద్రవ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ వంటి అంశాలను గురించి ప్రస్తావించారు.  ఈ ప్రక్రియల ద్వారా ఆవిష్కరణలకు, క్రియాశీలక కార్యకలాపాలకు స్టార్టప్ సంస్థలకు భారీ స్థాయిలో అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. స్వచ్ఛతా స్టార్టప్ చాలెంజ్ కార్యక్రమం 2022వ సంవత్సరం జనవరి 27న ప్రారంభమైంది.

కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (ఎస్.బి.ఎం.-యు.) పథకం కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏజెన్స్ ఫ్రాంకాయిస్ డి డెవలప్‌మెంట్ (ఎ.ఎఫ్.డి.), పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత పెట్టుబడుల శాఖ (డి.పి.ఐ.ఐ.టి.)ల సహకారంతో స్వచ్ఛతా స్టార్టప్ చాలెంజ్ కార్యక్రమం మొదలైంది.

వ్యర్థ పదార్థాల, వ్యర్థ వస్తు సామగ్రి నిర్వహణా రంగంలో పనిచేసే స్టార్టప్ కంపెనీలకు, ఇతర ఔత్సాహిక సంస్థలకు సానుకూల వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో  ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వ్యర్థాల నిర్వహణ రంగంలో సృజనాత్మక పరిష్కారాలను కనుగొన వలసిందిగా స్వచ్ఛతా స్టార్టప్ చాలెంజ్ కార్యక్రమం కింద స్టార్టప్ కంపెనీలను కోరారు.

నాలుగు పద్ధతుల్లో ఈ పరిష్కారాలను కోరారు. అవి,. (1) సామాజిక సమ్మిళితం, (2) జీరో డంప్ (ఘన వ్యర్థాల నిర్వహణ), (3) ప్లాస్ట్ వ్యర్థాల నిర్వహణ (4) పారదర్శకత (డిజిటల్ ఎనేబుల్మెంట్). స్టార్టప్ కంపెనీ నుంచి అందిన పది చక్కని పరిష్కారాలకు అవార్డు అందించాలని కూడా స్వచ్ఛతా స్టార్టప్ చాలెంజ్ కార్యక్రమంలో నిర్దేశించుకున్నారు.

ఈ కార్యక్రమం కింద ఎంపికైన స్టార్టప్ ప్రాజెక్టుకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని, ఏడాది పాటు ఇంక్యుబేషన్ మద్దతును  అందించాలన్న లక్ష్యం కూడా పెట్టుకున్నారు. దీనికి తోడుగా, అర్హత సాధించిన స్టార్టప్ కంపెనీలకు విల్‌గ్రో సంస్థనుంచి రూ. 50 లక్షల కొనసాగింపు పెట్టుబడి, లక్ష అమెరిన్ డాలర్ల వరకూ రుణాలు, భాగస్వామ్యసంస్థ అయిన అమెజాన్‌ వెబ్ సర్వీసెస్‌నుంచి సాంకేతిక పరిజ్ఞానం రూపంలో తోడ్పాటు అందిస్తారు.

స్వచ్ఛతా స్టార్టప్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పరిష్కారాలను అందించాలంటూ 2022 జనవరి 27 నుంచి 2022 ఏప్రిల్ 15 వరకూ స్టార్టప్ కంపెనీ నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 244 దరఖాస్తులు అందాయి. ఆ తర్వాత, వాటి నుంచి 30 పరిష్కారాలను  తదుపరి మదింపు ప్రక్రియ కోసం జ్యూరీ ఎంపిక చేసింది.

విద్యావేత్తలు, పారిశ్రామిక రంగం ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఈ జ్యూరీని ఏర్పాటు చేశారు. 30 పరిష్కారాల నుంచి పది దరఖాస్తులను ఎంపిక చేసి, ఈ చాలెంజ్ కార్యక్రమ విజేతలుగా ప్రకటిస్తూ అవార్డు అందిస్తారు.

‘స్వచ్ఛతా స్టార్టప్ సమ్మేళనం’ పేరిట ఈ అవార్డు ప్రదానం కార్యక్రమం మంగళవారం రోజంతా జరుగుతుంది. సమ్మేళనంలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చెత్తరహిత నగరాలను ప్రోత్సాహించడంలో స్టార్టప్ కంపెనీలకు భాగస్వామ్యం, వివిధ ఔత్సాహిక సంస్థలు, యూనికార్న్ స్టార్టప్ కంపెనీల అనుభవాలను పంచుకోవడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

  స్వచ్ఛతా స్టార్టప్ చాలెంజ్ కార్యక్రమానికి సంబంధించిన అన్ని స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, స్థిరీకరణ పొందిన స్టార్టప్ కంపెనీలు, పెట్టుబడిదార్లు, సెక్టార్ భాగస్వామ్య సంస్థలు, పారిశ్రామిక నిపుణులు, అనేక నగరాలకు చెందిన మునిసిపల్ కమిషనర్లు, డి.పి.ఐ.ఐ.టి. ప్రతినిధులు, భారత పారిశ్రామిక, వాణిజ్య మండలి (ఎఫ్.సి.సి.ఐ.), భారత పారిశ్రామిక సమాఖ్య (సి.ఐ.ఐ.) ప్రతినిధులు, తదితర సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయారు.