హిజాబ్‌కి వ్యతిరేకంగా ఇరాన్‌లో వెల్లువెత్తుతున్న ఆందోళనలు

హిజాబ్‌కి వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మహ్సా అమ్నీ (22) అనే మహిళ మృతితో ఇరాన్‌లో నిరసనలు చెలరేరేగాయి. ఆదివారం పలువురు ఇరాన్‌ మహిళలు తమ హిజాబ్‌లను బహిరంగంగా తీసివేసి తగులబెట్టి నిరసన తెలిపారు.  22 ఏళ్ల మహ్సా అమిని తన కుటుంబంతో కలిసి ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సందర్శనకు వెళ్లింది.

ఆ దేశ మహిళలు కఠినమైన దుస్తుల కోడ్‌ పాటించేలా బాధ్యత వహించే పోలీసులు ఆమె హిజాబ్‌ ధరించకపోవడాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ యువతిని అరెస్ట్‌ చేశారు. అయితే నైతిక పోలీసుల కస్టడీలో ఉన్న ఆమె మూడు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించగా ఆ యువతి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే మరణించినట్లు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ సంఘటన ఇరాన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం మహిళల డ్రెస్‌ కోడ్‌ పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని, తలపై కొట్టడంతో ఆ యువతి కోమాలోకి వెళ్లి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులతోపాటు కొన్ని వార్తా సంస్థలు ఆరోపించాయి.

ఈ నేపథ్యంలో శనివారం అమి అంత్యక్రియల సందర్భంగా ఇరాన్‌ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హిజాబ్‌ తొలగించి నిరసన తెలిపారు. ‘నియంతృత్వం మరణించాలి’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భద్రతా బలగాలు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించిన నిరసనకారులను చెదరగొట్టారు.

ఇరాన్ లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే చట్టం ఉంది. అయితే తాజాగా మహ్సా అమిని మరణం తర్వాత పెద్ద సంఖ్యలో అక్కడి మహిళలు బయటికొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.  ఇరాన్ మహిళలు ఇప్పటికే నిరసనల్లో పాల్గొంటుండగా తాజాగా కొందరు మహిళలు మహ్సా అమిని మృతికి నిరసనగా తమ జుట్టును కత్తిరించుకుంటున్నారు.

హిజాబ్ లను తగలబెడుతున్నారు. తమ పట్ల కఠినంగా అమలుపరుస్తున్న చట్టాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జుట్టును కట్ చేసుకుంటున్న ఓ వీడియోను తాజాగా ఇరాన్ కు చెందిన ఓ జర్నలిస్ట్ షేర్ చేశారు. తనతో పాటు మరికొందరు టెహ్రాన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారని చెప్పారు.

తాను 7 ఏళ్ల నుంచే హిజాబ్ ధరించకుండా బయటికి వెళ్లి నిచ్చేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రోజురోజుకు మిన్నంటుతున్న ఆందోళనను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించాయి. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలను పయోగించి ఆందోళనలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు ప్రపంచ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ఇరాన్‌లోని అమెరికా ప్రతినిధులు కూడా ఈ దారుణాన్ని ఖండించారు. చిత్రహింసలకు గురిచేసి యువతి మహ్సా అమి మరణానికి కారణమైన వారిని న్యాయవ్యవస్థ ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.