ఉబ్జెకిస్తాన్లో రష్యా, చైనా, పాక్ అధినేతలతో మోదీ భేటీ!

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో ప్రారంభంకానున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో కొన్ని కీలక దేశాధినేతలు కరోనా మహమ్మారి అనంతరం తొలిసారిగా ప్రత్యక్షంగా ఒకే వేదికపై కలుసుకోనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కొందరు కీలక నేతలతో జరిపే ద్వైపాక్షిక సమావేశాలు ప్రాధాన్యత సంతరింప చేసుకోనున్నాయి. 

ఈ విషయమై భారత  ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య చర్చలు జరుగుతాయని రష్యా నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది.  వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్య సమితి, జి-20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కూడా భారత ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు భారత్, చైనా మధ్య సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణ వాతావరణం. అలాగే తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద పెట్రోలింగ్‌ పాయింట్‌-15 నుంచి భారత, చైనా బలగాలు వెనక్కి మళ్లిన నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొంత వరకు సడలినట్టుగా కనిపించడం గమనార్హం.

మొదటిసారిగా, పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒకే సదస్సులో ప్రధాని మోదీకి ఎదురు ఎదుటి రు కానున్నారు. వారిద్దరి మధ్య భేటీ జరిగే అవకాశాల గురించి రెండు దేశాలు సహితం మౌనం పాటిస్తున్నాయి. 

డిసెంబరులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి, 2023లో జీ-20, ఎస్ సి ఓ లకు  భారత్‌ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో మోదీ జరిగే భేటీలు ప్రాధాన్యత సంతరింప చేసుకోనున్నాయి. అట్లనే ఇరాన్ అధినేతతోనూ ప్రధాని మోదీ ద్వైపాకిక సమావేశంలో పాల్గొననున్నారు. 

2001లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థలో చైనా, కజక్‌స్థాన్‌, కిర్గిజిస్థాన్‌, రష్యా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, భారత్‌, పాకిస్థాన్​కు పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. భారత్‌, పాకిస్తాన్ 2017లో సభ్యులయ్యాయి.  ఇక, పరిశీలక దేశాలుగా ఆఫ్గానిస్థాన్‌, బెలారస్‌, మంగోలియా కొనసాగుతున్నాయి. కంబోడియా, నేపాల్‌, శ్రీలంక, తుర్కియే, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాలు కూడా చర్చల్లో భాగస్వామ్య హోదాను కలిగి ఉన్నాయి.