పాక్ ఫిషింగ్ బోటులో రూ.200కోట్ల విలువైన డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

అరేబియా స‌ముద్రంలో భార‌త జ‌లాల్లోకి ప్ర‌వేశించిన పాకిస్థానీ ఫిషింగ్ బోటులో హెరాయిన్ ని త‌ర‌లిస్తుండ‌గా అధికారులు గుర్తించి డ్ర‌గ్స్ ని సీజ్ చేశారు. గుజరాత్‌ సముద్ర తీరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది.  ఇండియన్ కోస్ట్ గార్డ్ టీమ్, గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 40 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోటులో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో సుమారు రూ.200 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్, ఏటీఎస్ సంయుక్త బృందం కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో సముద్రంలో మాదక ద్రవ్యాలను తీసుకెళ్తున్న మత్స్యకార పడవను అడ్డగించిందని ఓ అధికారి తెలిపారు.
గుజరాత్ తీరంలో జఖావూ నుంచి  33 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పాకిస్థానీ పడవ అల్ తయ్యసను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు ఫాస్ట్ అటాక్ బోట్లు పాల్గొన్నాయి. తదుపరి దర్యాప్తు కోసం ఈ పడవను, దీనిలోని ఆరుగురు సిబ్బందిని జఖావూ తీసుకెళ్లారు.
కోస్ట్ గార్డ్, ఏటీఎస్ గతంలో కూడా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకున్నాయి. 2021 అక్టోబరులో రూ.21,000 కోట్ల విలువైన 2,988 కేజీల హెరాయిన్‌ను గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్నాయి.  హెరాయిన్‌ను గుజరాత్‌ తీరంలో ల్యాండ్‌ చేసిన తర్వాత రోడ్డు మార్గంలో పంజాబ్‌కు తీసుకెళ్తున‌ట్టు తెలిపారు. నిఘా వ‌ర్గాల పక్కా సమాచారం మేరకు పాకిస్థాన్ నుంచి వచ్చిన పడవను అడ్డగించి ఆరుగురు పాకిస్థానీ పౌరులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
గత కొన్ని నెలలుగా గుజరాత్ ఏటీఎస్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన రెండు మత్స్యకార పడవలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గత నెలలో స్వాధీనం చేసుకుంది. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఇండో-పాక్ సరిహద్దుల్లో ఈ ఆపరేషన్ జరిగింది.    డీఆర్‌ఐ సహకారంతో గుజరాత్ ఏటీఎస్ మరోసారి భారీ చర్య తీసుకోవడం ద్వారా భారీ డ్రగ్స్‌ను పట్టుకోగలిగింది.