హైదరాబాద్ నగరంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా, విశేష పూజలందుకున్న గణనాథుల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది రోజులు పూజలందుకున్న గౌరీ తనయుడు గణపయ్య గంగమ్మ ఒడికి చేరిండు. హైదరాబాద్లో శుక్రవారం కన్నులపండువగా శోభాయాత్రలు సాగాయి. లక్షలాది మంది భక్తులు ట్యాంక్బండ్కు తరలి వచ్చి వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. నృత్యాలు, కేరింతలతో పరిసరాలు హోరెత్తాయి.
దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే భాగ్యనగర నిమజ్జనోత్సవం పెద్ద సంఖ్యలో భక్తజనుల ఆటాపాటల నడుమ అట్టహాసంగా సాగింది. విభిన్న రూపాల్లో, రంగుల్లో వందల కొద్దీ విగ్రహాలు నగరం నలుమూలల నుంచి హుస్సేన్సాగర్ వైపు శోభాయాత్రగా కదిలివచ్చాయి. బ్యాండు మేళాలు, నృత్యాలు, భజనలు, కోలాటాలతో హైదరాబాద్ అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు కుటుంబసభ్యులతో కలిసి వేడుకలో పాల్గొనడం.. విగ్రహాల ఎదుట యువతులు సంబురంగా నృత్యాలు చేయడం కనిపించింది. రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణ అయిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆలస్యమైనా కన్నులపండుగగా ముగిసింది. ఈసారి మట్టి వినాయకుడు కావడం.. గురువారం రాత్రి భారీ వర్షం పడటంతో మహా గణపతిని వాహనంపైకి తరలించే ప్రక్రియలో ఆలస్యమైంది.
ఎంజే మార్కెట్, ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ జనంతో నిండిపోయాయి. వాన పడుతున్నా లెక్క చేయకుండా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖైరతాబాద్ బడా గణేశుడి శోభా యాత్ర ఈ సారి ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు బడా గణేశుడ్ని భారీ ట్రాలీ పైకి ఎక్కించినా యాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఏడు గంటల పాటు సాగింది.
సాయంత్రం 6.58 గంటలకు ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నంబర్ 4 వద్ద హుస్సేన్సాగర్లో ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం పూర్తయింది. సిటీలో మరో ముఖ్యమైన బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు ఉదయం 11.40 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 10.45 గంటలకు నిమజ్జనం పూర్తయింది.
చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, చార్మినార్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్ మీదుగా ట్యాంక్బండ్కు ప్రధాన ఊరేగింపు సాగగా.. కర్మన్ఘాట్, గడ్డిఅన్నారం, రామంతాపూర్, బేగంపేట, చిలకలగూడ, సికింద్రాబాద్, అమీర్పేట్ మీదుగా ఇతర ఊరేగింపులు హుస్సేన్సాగర్కు చేరుకున్నాయి.
ఉదయం 9 నుంచే ట్యాంక్బండ్ పరిసరాలు జనంతో నిండిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు చుట్టుపక్కల ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయాయి. చాంద్రాయణగుట్ట నుంచి వచ్చే శోభాయాత్ర ఉదయం 7 గంటల నుంచే షురూ అయింది. మక్కా మసీదులో ప్రార్థనలు జరిగే సమయంలో గంట పాటు నిలిపివేశారు. తర్వాత యథావిధిగా యాత్ర సాగింది. చార్మినార్ మీదుగా యాత్ర ప్రశాంతంగా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో నిమజ్జనం కోసం 35 వేల మంది బలగాలతో పోలుసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరుగుతున్న రూట్లలో ప్రత్యేకంగా 739 సీసీ కెమెరాలు అమర్చారు. ట్యాంక్బండ్ పరిసరాల్లో పది డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
డీజీపీ ఆఫీస్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, బషీర్బాగ్ సీపీ ఆఫీస్లోని కంట్రోల్ రూమ్ నుంచి శోభాయాత్రను పోలీసులు ట్రాక్ చేశారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితితో కలిసి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు పూర్తి చేశారు.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి