ఉద్దవ్‌ థాక్రే బీజేపీకి చేసింది ముమ్మాటికీ ద్రోహమే… అమిత్ షా ఆగ్రహం

రాజకీయాల్లో దేన్నైనా సహించగలంగానీ ద్రోహాన్ని సహించలేమని స్పష్టం చేస్తూ ఉద్దవ్‌ థాక్రే (శివసేన అధినేత) బీజేపీకి చేసింది ముమ్మాటికీ ద్రోహమే అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందుకే ఆయనకు అలా (ప్రభుత్వం కుప్పకూలి.. సీఎం పదవీచిత్యుడు అయ్యడు) జరిగిందని తేల్చి చెప్పారు. 

ఉద్దవ్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ రాజకీయాల్లో మోసం చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అని షా తెలిపారు. శివసేన చీలడానికి, తదనంతర పరిణామాలకు ఉద్దవ్‌ థాక్రేనే కారణం అని ఆయన నిప్పులు చెరిగారు.  “అతని అధికార దాహమే.. దగ్గరి వాళ్లను ఎదురు తిరిగేలా చేసింది. బీజేపీని మోసం చేయడమే కాదు.. నమ్మిన సిద్దాంతాలకు వెన్నుపోటు పొడిచారు” అంటూ మండిపడ్డారు. 

అంతేకాదు.. మహరాష్ట్ర ప్రజలను ఘోరంగా అవమానించారని, దురాశతో అతను చేసిన పని పార్టీని ముంచేసిందని అమిత్ షా ధ్వజమెత్తారు. ఉద్దవ్‌ థాక్రేను ముఖ్యమంత్రిని చేస్తామని తాము (బీజేపీ) ఏనాడూ  చెప్పలేదని స్పష్టం చేశారు. తలుపులు మూసుకుని గదుల్లో రాజకీయాలు చేయడం తమకు తెలియదని వెల్లడించారు. “మాకు తెలిసింది బహిరంగ రాజకీయాలు” అని అమిత్‌ షా అక్కడున్న నేతలను ఉద్దేశించి చెప్పారు. 

రాజకీయాల్లో మనం ఏది సహించినా రాజకీయ ద్రోహాన్ని సహించకూడదన్నారని అమిత్ షా పార్టీ  వర్గాలకు దిశానిర్ధేశం చేశారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే శివసేన పార్టీ చీలిపోవడానికి బాధ్యతవహించాలని ఆయన  స్పష్టం చేశారు. ఉద్దవ్ అత్యాశవల్లే అతడిపార్టీ సభ్యులు వ్యతిరేకులయ్యారని,  ఉద్దవ్ పదవీవ్యామోహంతోనే శివసేన కుంచించుకుపోయిందని విమర్శలు గుప్పించారు.

ఇక ముంబై స్థానిక సంస్థల ఎన్నికల కోసం మిషన్‌ 150ను బిజెపి తెరపైకి తెచ్చింది బీజేపీ. దేశంలోనే అత్యంత సంపన్నమైన పౌర సంస్థగా బృహణ్‌ముంబై కార్పొరేషన్‌కు పేరుంది. 30 సంవత్సరాలుగా శివసేన ఈ కార్పొరేషన్ లో విజయం సాధిస్తూ, మేయర్ పదవితో పాటు పరిపాలనపై ఆధిపత్యం వహిస్తూ వస్తున్నది.  మరో కొద్దీ నెలల్లో  ఎన్నికలు జరుగవలసి ఉంది.  అందుకే ఈ సారి దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ప్రయత్నిస్తోంది.