నాలుగు రోజుల పర్యటనకు భారత్ చేరుకున్న షైక్ హసీనా 

బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా మన దేశంలో 4 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు ఢిల్లీ ఎయిర్​పోర్టులో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి దర్మనా జర్దోశ్​ స్వాగతం పలికారు. షేక్​ హసీనా పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఆరిందం బాగ్చీ చెప్పారు. 

షేక్ హసీనా ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. రక్షణ, పెట్టుబడులు, ఇంధనం రంగాలలో పరస్పర సహకారం, ఉమ్మడి నదీ జలాల పంపకాలు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత నిర్వహణ, డ్రగ్స్​ అక్రమ రవాణ నియంత్రణ మొదలైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.  

 ప్రత్యేకించి ఈసారి బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన దశలో ఇరుదేశాల మధ్య కుషియారా నది జలాల పంపిణీ ఒప్పందంపై సంతకాలు ఉంటాయని అధికారిక అజెండాతో స్పష్టం అయింది. నదీ జలాల పంపిణీకి సంబంధించి తాత్కాలిక ఎంఒయు గత నెలలోనే ఇరు పక్షాల మధ్య ఖరారు అయింది.

 కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) నిర్వహించే ఓ బిజినెస్ సమ్మిట్ కు ఆమె హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్​ ధన్​కర్​తో ఆమె మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.  సోమవారం ఆమె రాగానే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హసీనాను కొద్ది సేపు కలిసి, ఆమెకు స్వాగతం పలికారు. ఢిల్లీకి రాగానే షేక్ హసీనా స్థానికంగా ఉన్న నిజాముద్దిన్ ఔలియా దర్గాను సందర్శించారు.

చివరి రోజైన గురువారం రాజస్థాన్​లోని అజ్మీర్‌‌కు వెళ్తారు. అక్కడ సూఫీ సెయింట్ మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శిస్తారు. షేక్ హసీనా బృందంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్, వాణిజ్య,  రైల్వే మంత్రి, ఆర్థిక వ్యవహారాల సలహాదారు ఉన్నారు.  హసీనా చివరి సారిగా 2019 అక్టోబర్​లో భారత్ లో పర్యటించారు. నిరుడు మార్చిలో నిర్వహించిన 50 ఏండ్ల స్వాతంత్ర్య వేడుకలకు నరేంద్ర మోదీ బంగ్లాదేశ్​ వెళ్లొచ్చారు.