అప్పుల గురించి ప్రశ్నిస్తే కేంద్రం కేంద్రంపై నిందలు వేస్తారా?

కేసీఆర్  ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు చేస్తున్న అప్పుల గురించి ప్రశ్నిస్తే కేంద్రంపై నిందలు వేస్తారా? అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బడ్జెట్ లో పెట్టకుండా, అసెంబ్లీలో చెప్పకుండా అప్పులు తీసుకోవడం వల్ల ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు.
జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవాసీ యోజన్‌లో భాగంగా.. జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించేందుకు నిర్మలా సీతారామన్‌ గురువారం కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.
రాష్ర్ట ప్రభుత్వం చేసే అప్పుల భారం ప్రజలపై పడుతుందని చెబుతూ తెలంగాణలో పుట్టే ఒక్కో బిడ్డపై రూ.1.20 లక్షల అప్పు ఉంటోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్ట అప్పుల గురించి మాట్లాడానికి, ప్రశ్నించడానికి కేంద్రానికి పూర్తి అధికారం ఉందని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. అప్పుల గురించి కేంద్రం అడిగితే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. 
 
‘‘తెలంగాణను కేసీఆర్‌ అప్పుల్లోకి నెట్టేశారు. ఆ రాష్ట్రంలో ప్రతీ శిశువుపై రూ. 1.25 లక్షల అప్పు ఉంది.  తెలంగాణలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి తెలంగాణ అప్పులు చేసింది. కేంద్రం నిధులిచ్చినా కేసీఆర్‌ బద్నాం చేస్తున్నారు. ప్రజలను భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారు” అంటూ ఆర్ధిక మంత్రి విమర్శించారు. 
 
 అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానం చెబితే ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా..? అని ఆమె చెప్పారు. రాష్ర్టాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా జాతీయ నాయకుడిగా సీఎం కేసీఆర్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారంటూ నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు.  కేంద్ర పథకాల పేర్లను మార్చి, కొత్త పేర్లు పెట్టి నడుపుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె  మండిపడ్డారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కేసీఆర్ చెప్పే మాటలను వినలేకపోయారని ఆమె గుర్తు చేశారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రజలకు చేర్చాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా తాము నిలదీస్తామని ఆమె తేల్చి  చెప్పారు. ఈ విషయంలో తమకు బాధ్యత ఉందని తెలిపారు.
అప్పుల గురించి రాష్ట్ర ప్రజలకు సమాధానాలు చెప్పిన తర్వాత దేశమంతా తిరగండి అంటూ ఆమె మండిపడ్డారు. అప్పులపై కేంద్రం కోతలు పెడుతుందని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాఖ్యలలో ఏ మాత్రం నిజం లేదని ఆమె చెప్పారు. ఎనిమిదేళ్లలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రూ.20 వేల కోట్లు ఇచ్చామని ఆమె స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా రైతుల భూములను లాక్కుంటోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారని దీంతో అడ్డగోలుగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు అంచనా రూ. 38 వేల 500 కోట్ల నుంచి రూ. లక్షా 20 వేల కోట్లకు పెరిగిందని ఆమె గుర్తు చేశారు. 
 
రాష్ట్రంలో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని ఆమె విమర్శించారు. కేంద్రంపై అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదని కేసీఆర్ కు హితవు చెప్పారు. పీఎం అవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంగా మార్చారని నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు.  
 
రాష్ట్ర రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఈ పథకం ద్వారా రైతులకు పంటలు ఎలా నష్టపోయినా పరిహారం కేంద్రం అందిస్తుందని ఆమె నిలదీసేరు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
గొర్రెలు, చేపల పెంపకానికి కూడా కేంద్రం ఇస్తున్న నిధులే రాష్ట్ర ప్రభుత్వం వాడుతోందని ఆమె చెప్పారు. సీఎం కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో ఇవాళ రైతులు అప్పుల పాలయ్యారని పేర్కొంటూ  రైతు రుణమాఫీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.