జార్ఖండ్ డుమ్కాలో ఓ ప్రేమోన్మాది అంకిత సింగ్ అనే బాలికను సజీవ దహనం కావించిన సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రవేశాలకు దారితీసింది. 12వ తరగతి చదువుతున్న బాధితురాలి వయసును తొలుత 19 ఏళ్లుగా రిపోర్ట్లో పొందుపరచిన పోలీసులు మీడియాకు మాత్రం వయసును 17 ఏళ్లుగా చెప్పి నిందితుడైన కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అంటూ ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
దానితో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫ్ఫేర్ కమిటీ ఆమె మేజర్ కాదని, మైనర్ అంటూ నిర్ధారించింది. దీంతో పోక్సో చట్టం ప్రకారం కేసు, నిందితుడిపై అభియోగాలను నమోదు చేయాలని ఈ ప్యానెల్ పోలీసులను ఆదేశించింది. ఆమె వయసును 15ఏళ్లుగా నిర్ధారిస్తూ రికార్డెడ్ స్టేట్మెంట్లోనూ ఆమె వయసును సవరించాలంటూ స్థానిక ఎస్పీకి సూచించింది.
డుమ్కా ప్రాంతానికి చెందిన అంకితా కుమారి సింగ్ను.. పొరుగింట్లో ఉండే షారూఖ్ హుస్సేన్ (19) ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు. పెద్దలు మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆగష్టు 23వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి, నిప్పటించి పారిపోయాడు.
90 శాతం తీవ్ర గాయాలతో ఫులో జానో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 28న అంకిత కన్నుమూసింది. ఈ ఘటనలో బాధితురాలిని వేధింపులు, మతం మారాలనే ఒత్తిడి చేసినట్లు తేలడంతో ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలను దారి తీసింది. బీజేపీతో పాటు భజరంగ్ దల్ కార్యకర్తలు బాధితురాలి న్యాయం కోసం పోరాటానికి దిగారు.
నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. మరోవైపు బీజేపీ ఒత్తిడితో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ 10 లక్షల పరిహారం ప్రకటించగా, ఆమె తండ్రి సంజీవ్ సింగ్ ఆ పరిహారాన్ని తిరస్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక కేసులో సత్వర న్యాయం కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే, నిందితుడు షారూఖ్ హుస్సేన్తో సన్నిహితంగా ఉన్న బాధితురాలి ఫొటోలు కొన్ని నెట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై అంకిత కుటుంబం స్పందించింది. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, నిందితుడిని బయటపడేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయంటూ మండిపడింది. తమ కూతురికి సత్వర న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించింది అంకిత కుటుంబం. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినవని తేలింది.
మరోవంక, డుమ్కా మైనర్ హత్యోదంతంపై జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ బుధవారం డుమ్కాలో పర్యటించి వివరాలను సేకరించింది. అయితే, బాధితురాలి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడంపై ఎన్సీడబ్ల్యూ లీగల్ కౌన్సెలర్ షాలిని సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది బాధితురాలి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, దానిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
More Stories
రక్షణ, వాణిజ్య రంగాల్లో చైనా, రష్యా మరింత సహకారం
జూన్ 4 తర్వాత కూటమి విచ్ఛిన్నం ఖాయం
సీఎస్, డీజీపీలపై ఎన్నికల కమిషన్ కన్నెర్ర