యూపీఐ చెల్లింపులపై ఛార్జీలకు ఇది సమయం కాదు

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీల విధించడానికి ఇది సరైన సమయం కాదని కేంద్రం విశ్వసిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న డిజిటల్ పేమెంట్ విధానాన్ని వారు ఎంతో సులభంగా నిర్వహించగలుగుతున్నారు. దీంతో భారత ఆర్థిక రంగం ఎంతో ఆకర్షణీయంగా తయారైంది.

చెల్లింపుల విధానంలో పారదర్శకత మనం సాధించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సూచించారు. ఈక్రమంలో డిజిటల్ పేమెంట్‌పై ఛార్జీలు విధించడం ఈ సమయంలో సరికాదని భావిస్తున్నామని తెలిపారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ప్రజలు ఈ సేవలను ఉచితంగానే పొందవచ్చని తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులపై ఛార్జీల విధింపునపై ఆర్‌బిఐ ప్రతిపాదనలు సిద్దం చేస్తోందనే పలు రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ వివరణ ఇచ్చారు.

”డిజిటల్‌ చెల్లింపులనేది ప్రజల ఉత్పత్తి. భారత ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్‌లో భాగంగా ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు. డిజిటలైజేషన్‌ ద్వారానే పారదర్శకత పెరుగు తుంది. ప్రజలను ఈ లావాదేవీల వైపు మళ్లించాలనేదే ప్రభుత్వ లక్ష్యం.” అని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది జులైలో యుపిఐ లావా దేవీలు 600 కోట్ల మార్క్‌ను అధిగమించాయి.

ఆర్బీఐ తమ సిఫార్సులును ప్రస్తుతానికి తన వద్దనే ఉంచాలని ఆమె సూచించారు. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ట్రాన్సక్షన్స్‌పై ఛార్జీలు విధింపుపై ప్రజలు తమ స్పందన తెలియజేయాల్సిందిగా ఈనెల ఆర్బీఐ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు వ్యాపార వర్గాలకు ఉపశమనం కలిగించాయి.

కాగా గతవారమే కేంద్రం యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించమని ప్రకటించింది. మరోవైపు ఆర్‌టిజిఎస్, ఎన్‌ఇఎఫ్‌టి పేమెంట్స్ సిస్టమ్స్‌ను భారత్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా నిర్వహిస్తోంది. అదేవిధంగా ఐఎంపిఎస్, రూపే, తదితర సిస్టమ్స్‌ను నేషనల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది.

ఈ ఏడాది జులై నాటికి అత్యధికంగా డిజిటల్ లావాదేవీల సంఖ్య 6.28 బిలియన్‌కు చేరుకుంది. నేషనల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా చేసిన డేటా ప్రకారం ఈ లావాదేవీల విలువ రూ.10.62 ట్రిలియన్‌గా తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పట్లో డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీలు ఉండకపోవచ్చని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి.