డీఆర్‌డీవో చైర్మన్ గా సమీర్‌ వి కామత్‌

ప్రముఖ శాస్త్రవేత్త సమీర్‌ వి కామత్‌ రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ  (డీడీఆర్‌డీ) కార్యదర్శిగా,  రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, ప్రస్తుత డీఆర్‌డీవో చైర్మన్  జి.సతీశ్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కామత్‌ డీఆర్‌డీవోలో నేవల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామత్, సతీశ్‌రెడ్డిల నియామకాలను కేబినెట్‌ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది.

బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు కామత్‌ నూతన బాధ్యతల్లో కొనసాగుతారని కూడా వివరించింది. డీఆర్‌డీవో చీఫ్‌గా జి.సతీశ్‌రెడ్డి రెండేళ్ల పదవీ కాలానికి గాను 2018లో నియమితులయ్యారు. 2020 ఆగస్ట్‌లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. తాజాగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు బాధ్యతలు అప్పగించింది.