18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల హెచ్చరిక

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల దేశంలోని 18 రాష్ట్రాల్లో ఈ వారం రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాన్ ప్రభావం వల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 
 
ఐఎండీ అధికారులు బుధవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో ఒడిశా రాష్ట్రానికి వరద హెచ్చరిక జారీ చేసింది. ఒడిశా  రాష్ట్రంలోని బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, మయూర్‌భంజ్, కియోంజర్, సముద్ర తీర ప్రాంతంలోని కేంద్రపరా, కటక్, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
 
ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.ఒడిశాలో కురుస్తున్న అతి భారీవర్షాల వల్ల పలు నదుల్లో నీటిమట్టం పెరిగింది.
బుధవారం ఒడిశాలో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ జారీ చేసిన హెచ్చరికలతో బలియాపాల్, భోగ్రాయ్, బస్తా, జలేశ్వర్ బ్లాక్‌లలో రెస్క్యూ, రిలీఫ్ టీమ్‌లను మోహరించామని జిల్లా కలెక్టర్ దత్తాత్రయ షిండే చెప్పారు.అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ నెల 26, 27 తేదీల్లో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వచ్చే ఐదు రోజుల్లో అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. రాబోయే 24 గంటల్లో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌లో, రాబోయే రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.
బుధవారం నాడు కోస్తా, దక్షిణ కర్షాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ నెల 26 వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. కేరళ, మహారాష్ట్రలలో ఈ నెల 27వ తేదీ వరకు విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో పేర్కొంది.