లద్దాఖ్‌లో ఎవరూ ఎక్కని పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ, కావ్య

తెలంగాణలోని కామారెడ్డికి చెందిన  పర్వతారోహకులు మలావత్ పూర్ణ, కావ్య మన్యపు లద్దాఖ్‌లో ఇప్పటివరకు ఎవరూ ఎక్కని పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ నెలకొల్పారు. పూర్ణ ఇప్పటికే 7 ఖండాల్లో ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. 
 
అమెరికాలోని నాసాలో అంతరిక్ష పరిశోధకురాలిగా పని చేస్తున్నకావ్య మన్యపు, పూర్ణ కలిసి ఆడపిల్లల విద్య కోసం ప్రాజెక్ట్ శక్తి పేరుతో పర్వతారోహణ మొదలుపెట్టారు. వంద మంది నిరుపేద, ప్రతిభావంతులైన బాలికలను విద్యతో పాటు వివిధ రంగాల్లో ప్రోత్సహించడమే ‘ప్రాజెక్ట్ శక్తి’ లక్ష్యం. 
 
మొత్తం లక్ష డాలర్లు (70-80 లక్షల రూపాయలు) నిధుల సేకరణే ధ్యేయంగా పెట్టుకున్న కావ్య, పూర్ణ 8 మంది సభ్యులతో బృందంగా ఏర్పడి పర్వతారోహణ ప్రారంభించారు. ఆ బృందానికి లీడర్‌గా రెన్సీ థామస్, డిప్యూటీ లీడర్‌గా దివ్య ఠాకూర్ వ్యవహరించారు.  ఇకపై తాము చేపట్టే ప్రతి పర్వతారోహణ ద్వారా లక్ష డాలర్లను సేకరిస్తామని కావ్య వెల్లడించారు. 
 
వాటిని వంద మంది పేద బాలికల విద్య, సాధికారితకు వినియోగిస్తామని చెప్పారు. అమ్మాయిలు ఏదైనా సాధించగలరని చెప్పాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు. కామారెడ్డిలో పుట్టిన తమ ఇద్దరి ఆశయాలు ఒకటేనని, తమలా మరో వంద మందిని తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని కావ్య చెప్పుకొచ్చారు. పర్వతారోహణను వేదికగా చేసుకుని ప్రాజెక్ట్ శక్తిని ముందుకు తీసుకెళ్తున్నామని కావ్య వివరించారు. 
 
పేరు కూడా ఇంకా పెట్టని, ఎవరూ ఇంతవరకు ఎక్కని పర్వతాన్ని ఎక్కి ప్రాజెక్ట్ శక్తిలో మొదటి అడుగు వేశామని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్లి అక్కడ వంద మంది చురుకైన అమ్మాయిలను గుర్తించాలనుకుంటున్నట్టు తెలిపారు. అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. 
 
అమెరికాలో ఒక విద్యా సంస్థ మెంటార్‌గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తామని కావ్య వెల్లడించారు. విరాళాలు తీసుకుని ఒక ఎన్జీవోకు ఇచ్చి వదిలేయకుండా తాము కూడా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. 
 
సోషల్ మీడియా ద్వారా ప్రాజెక్ట్ శక్తికి నిధులు సమీకరిస్తున్నామని తెలిపారు. పూర్ణతో పోల్చుకుంటే తాను అమెచ్యూర్ మౌంటెనీర్‌నన్న కావ్య, ఇప్పటివరకు కిలిమంజారో ఎక్కానని, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నానని, అలాస్కా, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లో కొన్ని పర్వతాలు అధిరోహించానని తెలిపారు.