ఉచితాలకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిందే

ఉచితాలు ఎప్పటికీ ఉచితాలు కావని ఆర్బీఐ మానిటరింగ్‌ పాలసీ కమిటీ సభ్యురాలు అషిమా గోయల్‌ స్పష్టం చేశారు. ప్రజలు ఏదో రూపంలో వాటికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉచితాలపై హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు వాటికి సంబంధించిన ఆర్థిక అంశాలను, వాటి ప్రభావాలను కూడా ఓటర్లకు వివరించాలని ఆమె కోరారు.

ఇలా చేస్తే ఉచిత హామీల విషయంలో పార్టీల మధ్య పోటీతత్వం తగ్గుతుందని ఆమె చెప్పారు. ఉచిత హామీలు ఇవ్వడం వల్ల ఆ భారాన్ని మరోచోట మోపాల్సి వస్తుందని ఆమె తెలిపారు. ఇది ప్రజలకు చేసే సేవలపై ప్రభావం చూపుతుందని అంటూ ధరలను వక్రీకరించే సబ్సీడీలు ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.

ఉచితాల మూలంగా ఉత్పత్తిపై, వనరుల కేటాయింపుపై ప్రభావం పడుతుందని ఆమె అషిమా గోయల్‌ చెప్పారు. ఇది పరోక్షంగా ఖర్చులు పెంచుతుందని ఆమె తెలిపారు. పంజాబ్‌లో ఉచిత విద్యుత్‌ మూలంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వీటి మూలంగా నాణ్యమైన విద్య, వైద్యం, గాలి, నీరు అందించలేమని ఆమె స్పష్టం చేశారు.

దీని వల్ల పేద ప్రజలే ఎక్కువ ప్రభావితం అవుతారని ఆమె చెప్పారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఉచితాల మూలంగా పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అవుతుందని పేర్కొనడం గమనార్హం.  వీటి మూలంగా దేశం స్వయం సంవృద్ధిని సాధించలేదని ఆయన పేర్కొన్నారు. దానితో ప్రస్తుతం దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఇటీవల సుప్రీంకోర్టు సైతం దీనిపై అలిమికాని ఉచిత హామీలపై ప్రత్యేకంగా పరిశీలన జరపాలని సూచించింది. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఆర్ధిక వ్యవస్థల వృద్ధిరేటు తగ్గుతున్న సమయంలో భారత్‌లో మాత్రం స్థిరంగా వృద్ధి చెందుతుందని ఆమె చెప్పారు.

అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మన దేశం చాలా దేశాల కంటే మెరుగ్గా ఉందని ఆమె తెలిపారు. లాక్‌డౌన్‌ మూలంగా పరిశ్రమలు, వ్యవసాయ రంగం దెబ్బతిన్నప్పటికీ, దేశీయంగా ఉన్న డిమాండ్‌ మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పటికీ తట్టుకోకలిగినట్లు ఆమె చెప్పారు.

ఎగుమతులు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి మూలంగా ఆర్ధిక మాంధ్యం పరిస్థితులు మనపై అంతగా ప్రభావం చూపడంలేదని అషిమా గోయల్‌ తెలిపారు. ఆర్థిక సంస్కరణలే మన వృద్ధిరేటు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. ఆర్థిక, ద్రవ్య విధానం సమన్వయంతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫాలితాలు ఇస్తున్నట్లు ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

రెపో రేటు పెంచడం వల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లు పెంచుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం నియంత్రలోకి రాకుంటే, అదే అతి పెద్ద సవాల్‌గా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల మూలంగా ద్రవ్యోల్బణం క్రమంగా అదుపులోకి వస్తున్న సూచనలు కనిస్తున్నాయని చెబుతూ అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 6 శాతం కంటే దిగువకు వచ్చే అవకాశం ఉందని ఆమె వివరించారు.

ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనాలు తగ్గుతున్నాయని పేర్కొంటూ వృద్ధిరేటు పెరిగితే క్రమంగా అనుకున్న టార్గెట్‌ను సాధించవచ్చని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్‌లో ద్రవ్యోల్బణం 7.01 శాతం ఉంటే, జులైలో అది 6.71 శాతంగా ఉంది. దీన్ని 4 శాతానికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆర్బీఐని కోరింది. ఈ దిశగానే రెపోరేట్లను పెంచుతుని ఆమె చెప్పారు. ఆర్బీఐ జోక్యం తరువాత రుపాయి క్షిణత కూడా ఇతర దేశాల కరెన్సీతో పోల్చితే తక్కువగానే ఉందని ఆమె గుర్తు చేశారు.