‘ఆసియా టైగర్‌’ అవుదామనుకొంటే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో పాక్

‘ఆసియా టైగర్‌’గా వెలిగిపోతుందనుకున్న పాకిస్తాన్‌ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని స్వయంగా  ఆ దేశ ప్రధాని హెహబాజ్‌ షరీఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఓ వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో పాక్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి వ్యవస్థీకృత   లోపాలే కారణమని స్పష్టం చేశారు.
అప్పులు, అధిక ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వలు క్షీణిస్తుండటంతో పాక్‌ ప్రస్తుతం ఆర్థికంగా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. నిత్యవసరాలతో పాటు ఇంధనం, మందుల ధరలు పెరగడంతో పాలకులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సమయంలో హెహబాజ్‌ వ్యాసం వెలువడటం గమనార్హం.
1960వ దశకంలో అభివృద్ధిపరంగా దూసుకెళ్లిన పాకిస్తాన్‌ తదుపరి ‘ఆసియా టైగర్‌’గా అవతరించేందుకు సిద్ధంగా ఉందని దేశం మొత్తం భావించిందని, కానీ, 2022 నాటికి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిందని తెలిపారు. అధిక ధరలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన ఆంక్షలు, ఐరోపాలో ఘర్షణ వాతావరణం వంటి సవాళ్ల మధ్య ఈ సంక్షోభం తీవ్రమైందని పేర్కొన్నారు.
దేశంలో అయిదు దశాబ్దాలుగా గుర్తించని బలహీనతలూ ఆర్థిక వృద్ధి కుంటుపడేందుకు కారణమయ్యాయని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా మూడు వ్యవస్థీకృత  లోపాలను ప్రస్తావించారు. అవి, ఏకపక్ష రాజకీయాలు, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం, గ్లోబలైజేషన్‌ ఫలాలను అందిపుచ్చుకోకపోవడమని పేర్కొన్నారు.
పాక్‌ నేడు ప్రపంచంలో అత్యంత వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని చెప్పారు. 15 శాతం మాత్రమే పెట్టుబడులు ఉన్నాయని, ఎగుమతులు కేవలం 10 శాతం మాత్రమేనని, ఒక ఏడాదిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జిడిపిలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వివరించారు.
ఇక్కడి సంస్థలు పాక్‌కే పరిమితం అవుతున్నాయని తెలిపారు. ఏ దేశం కూడా ఈ విధమైన పరిస్థితులతో అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుంచి సురక్షితంగా బయటపడటానికే తక్షణ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు.
 
ప్రాంతీయ స్థిరత్వం, క్రమపద్ధతిలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, పెట్టుబడులు పెట్టడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి చర్యలు అత్యవసరమని తెలిపారు. అదే సమయంలో పాకిస్థాన్‌ సమాజాన్ని ఆధునికీకరించడం చాలా ముఖ్యమన్నారు. కీలకమైన ప్రజా సేవలకు ప్రతిఫలంగా ప్రజలు పన్నులను తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు.