ఏడు ఇండియా-ఒక పాకిస్తాన్ యూట్యూబ్ ఛాన‌ల్స్ ర‌ద్దు

భారత దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఎనిమిది యూట్యూబ్ చానళ్ళను కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధించింది. వీటిలో ఒకటి పాకిస్థాన్  నుంచి పని చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఈ చానళ్ళ వ్యూవర్‌షిప్ 114 కోట్లకు పైగానే ఉంది. 85.73 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.  దీంతో గ‌త డిసెంబ‌ర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బ్లాక్ చేసిన ఛాన‌ళ్ల సంఖ్య 102కు చేరుకున్న‌ది. 
ఈ కంటెంట్ మానిటైజ్ అయింది. ఈ వివరాలను సమాచార, ప్రసార  మంత్రిత్వ శాఖ ఓ ప్రటకనలో వెల్లడించింది.  సమాచార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ యూట్యూబ్ చానళ్లు భారత దేశానికి వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసేవిధంగానూ, ప్రజా శాంతికి విఘాతం కలిగించే విధంగానూ, భారత దేశ విదేశీ సంబంధాలు దెబ్బతినే విధంగానూ ఈ చానళ్ళలోని వీడియోలలో ప్రకటనలు ఇస్తున్నారు.
భారత ప్రభుత్వం మతపరమైన కట్టడాలను కూల్చేస్తోందని, మతపరమైన పండుగలను జరుపుకోవడంపై నిషేధం విధిస్తోందని, మత యుద్ధాన్ని ప్రకటించిందని ఈ చానళ్ళు ప్రసారం చేస్తున్నాయని ఈ ప్రకటన తెలిపింది. భారత సైన్యం, జమ్మూ-కశ్మీరు వంటి అంశాలపై తప్పుడు, బూటకపు వార్తలను ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది.
 ఇటువంటి కంటెంట్ వల్ల దేశంలో మత సామరస్యం దెబ్బతింటుందని, ప్రజాశాంతికి విఘాతం కలుగుతుందని గుర్తించినట్లు తెలిపింది. ఈ చానళ్ళు ప్రసారం చేస్తున్న కంటెంట్ పూర్తిగా తప్పుడు కంటెంట్ అని, ఇది దేశ భద్రత, విదేశాలతో భారత దేశానికిగల స్నేహ సంబంధాలకు విఘాతం కలిగిస్తుందని గుర్తించినట్లు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం నిషేధించినవాటిలో ఓ ఫేస్‌బుక్ ఖాతా, రెండు ఫేస్‌బుక్ పోస్ట్‌లు కూడా ఉన్నాయి. వీటన్నిటి లక్ష్యం భారత దేశంలో వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడమేనని గుర్తించడంతో వీటిపై వేటు పడింది. దేశంలో కొన్ని వర్గాల మధ్య మత విధ్వేషం పెచ్చరిల్లేలా వీడియోలు ప్రసారం చేస్తున్నందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మతపరమైన కలహాలు సృష్టించే విధంగా వీడియోలు తయారు చేయడం, వదంతులతో పాటు అసత్య  ప్రచారాలకు పాల్పడుతున్నాయని తెలిపింది. దీని కారణంగా ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. పలు న్యూస్​ ఛానళ్లకు చెందిన లోగోలు.. వ్యూయర్స్​ను ఆకర్షించే విధంగా థంబ్​ నెయిల్​ వాడడం చేస్తున్నాయని పేర్కొంది.