ఉచిత తాయిలాలపై రాజకీయ పార్టీలను అడ్డుకోలేం 

ఉచిత తాయిలాలపై హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిలువరించలేమని భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు . ప్రజలకు సంక్షేమాన్ని అందజేయవలసిన కర్తవ్యం ప్రభుత్వాలకు ఉందని చెప్పారు. బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణలో తమ వాదనలను కూడా వినాలని డీఎంకే  మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌లో, ఎన్నికల ప్రచారంలో ఉచిత తాయిలాలపై హామీలు ఇవ్వడాన్ని అనుమతించకుండా ఎన్నికల కమిషన్‌ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమ కొహ్లీ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు చాలా సంక్లిష్టమవుతున్నాయని అభిప్రాయపడింది.
ఈ పిటిషన్‌పై విచారణలో తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే సుప్రీంకోర్టును కోరాయి. జస్టిస్ రమణ మాట్లాడుతూ, ఏది ఉచిత తాయిలం? ఏది కాదు? అనే అంశం చాలా సంక్లిష్టమవుతోందని పేర్కొన్నారు. హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని చెప్పారు.
ఏవి సరైన హామీలు? అనేదే ప్రశ్న అని తెలిపారు. ఉచిత విద్యను తాయిలం అని అనగలమా? అని ప్రశ్నించారు. ఉచిత తాగునీరు, కనీస స్థాయిలో విద్యుత్తును ఉచితంగా అందజేయడాన్ని తాయిలంగా చెప్పగలమా? అని అడిగారు. వినియోగదారుల ఉత్పత్తులు, ఉచిత ఎలక్ట్రానిక్స్ పరికరాలను సంక్షేమంగా వర్ణించగలమా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడానికి ఏది సరైన మార్గం? అనేదే ప్రస్తుత చర్చనీయాంశమని పేర్కొ న్నారు. డబ్బు వృధా అవుతోందని కొందరు అంటారని, అది సంక్షేమమని మరికొందరు అంటారని చెప్పారు. ఈ విషయాలు రాన్రానూ జటిలమవుతున్నాయని తెలిపారు. ‘‘మీరు మీ అభిప్రాయాలను చెప్పండి, చర్చి్ంచి, ఆలోచించి, నిర్ణయిస్తాం’’ అని చెప్పారు.
రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు మాత్రమే అవి ఎన్నికల్లో గెలవడానికి ప్రాతిపదిక కాబోవని చెప్పారు. దీనికి ఉదాహరణ గ్రామీణ ఉపాధి హామీ పథకమని చెప్పారు. ఈ పథకం ప్రజలకు హుందాగా జీవించే అవకాశాన్ని కల్పించిందని గుర్తు చేశారు. ఓటర్లకు హామీలు ఇచ్చినప్పటికీ కొన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవడం లేదని తెలిపారు. తదుపరి విచారణ వచ్చే వారం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఉచిత తాయిలాలుగా పేర్కొనరాదని డీఎంకే తన పిటిషన్‌లో వాదించింది. ఈ సంక్షేమ పథకాలను అనేక ప్రయోజనాల కోసం, అనేక ఉద్దేశాలతో, విశాల దృక్పథంతో అమలు చేస్తున్నట్లు వివరించింది. పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ దేశాన్ని సామ్యవాద దేశం నుంచి పెట్టుబడిదారీ దేశంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆదేశిక సూత్రాల స్ఫూర్తిని ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దెబ్బతీస్తుందని తెలిపింది. ఉచిత తాయిలాల సమస్యను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. 

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ప్రతిదాన్నీ ఉచితంగా పంపిణీ చేయడమే సాంఘిక సంక్షేమం అని అనుకుంటే, అది అపరిపక్వత అవుతుందని చెప్పారు. ఓటర్లు సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకుని, ఓటు వేయడానికి ఉచిత తాయిలాల హామీలు విఘాతం కలిగిస్తాయన్నారు. దీనివల్ల ఆర్థిక విపత్తు సంభవించవచ్చునని తెలిపారు. 

రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత తాయిలాల హామీలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. అయితే ఈ కమిటీలో పాలుపంచుకోవడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ విముఖత వ్యక్తం చేసింది.