స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎందరోమంది వీరులు, వీర వనితలు ఆత్మత్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జరుపుకుంటున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా జాతీయవాద చైతన్యం పెరుగుతోందని తెలిపారు.
 ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలోనూ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశాయని సంతోషం వ్యక్తం చేశారు. చిన్న-పెద్ద, పేద-ధనిక,గ్రామాలు-పట్టణాలు అనే తేడాలేవీ లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ప్రతి చోటా మువ్వన్నెల రెపరెపలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
, భారతదేశ స్వాతంత్ర్య సిద్ధికి ఘనమైన చరిత్ర ఉన్నట్లుగానే, ఆంధ్ర అసోసియేషన్‌కు కూడా గొప్ప చరిత్రే ఉందన్నారు. ప్రొఫెసర్ ఎన్జీ రంగా, డాక్టర్ అనంతశయనం అయ్యంగార్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ వరాహగిరి వెంకట గిరి, భోగరాజు పట్టాభిరామయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు వంటి ప్రముఖ దేశభక్తుల ఆలోచనల నుంచి 1935లో ఆంధ్ర అసోసియేషన్ పుట్టడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని తెలిపారు.
దేశ రాజధానిలో తెలుగువారికంటూ ప్రత్యేకమైన సంఘాన్ని ఏర్పాటుచేసి తెలుగు భాషను, మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంతోపాటు విస్తృతంగా సేవాకార్యక్రమాలు చేపట్టిన ఆంధ్ర అసోసియేషన్ బాధ్యులను కిషన్ రెడ్డి అభినందించారు. ఢిల్లీతో పాటుగా తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన భాష, మన పండగలు, మన ఆచార, వ్యవహారాలను ప్రోత్సహించే దిశగా కృషి చేస్తుండటం అభినందనీయమని చెప్పారు.
దేశ స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్ర కూడా చాలా ప్రత్యేకమైందన్న కిషన్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఎన్జీ రంగా, గాడిచర్ల హరిసర్వోత్తమరావు టంగుటూరి ప్రకాశం పంతులు, తుర్రేబాజ్ ఖాన్, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, దుర్గాబాయి దేశ్ ముఖ్, బూర్గుల రామకృష్ణా రావు, వావిలాల గోపాల కృష్ణయ్య, అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ గౌతు లచ్చన్నతో పాటుగా ఎంతోమంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడారని గుర్తు చేశారు.
నాటి వీరుంలదరి త్యాగాలను నేటి తరం గుర్తుచేసుకుని ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన సమయమిదని తెలియజేశారు. కొందరు ప్రత్యక్ష పోరాట బావుటాను ఎగరేసి ఆంగ్లేయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తే.. మరికొందరు తమ సాహిత్య అస్త్రాలతో ప్రజలను నిరంతరం చైతన్య పరుస్తూ బ్రిటిషర్ల గుండెల్లో నిద్రపోయారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన ‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడో తెల్పుడీ’ వంటి గీతాలు స్వరాజ్య సాధన కసిని మరింత పెంచిందని కొనియాడారు. గరిమెళ్ల వారు రాసిన ‘మాకొద్దీ తెల్లదొర తనము’, రాయప్రోలు రాసిన ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా’, నిజాం వ్యతిరేక పోరాటంలో సుద్దాల హనుమంతు గారు రాసిన ‘బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి’ అనే పాట ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయని వివరించారు.
తెలుగు తేజం విప్లవవీరుడైన అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన పోరాట స్ఫూర్తిని యావద్దేశానికి తెలియజేసే ఉద్దేశంతోనే ప్రధాన మంత్రి ద్వారా అల్లూరి 125వ  జయంతి కార్యక్రమాలను భీమవరంలో ఘనంగా నిర్వహించి, వారి విగ్రహాన్ని అవిష్కరింపజేశామని గుర్తు చేశారు. ఈనెల 22వ తేదీన అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో పర్యటించి రూ.50 కోట్లతో ఒక సర్క్యూట్ ఏర్పాటుచేయనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
అలాగే పింగళి వెంకయ్యను స్మరించుకున్న కేంద్ర మంత్రి వారిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారి జయంతి సందర్భంగా పింగళి కుటుంబ సభ్యులను కలిసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రముఖ తెలుగు గాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతిని కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి  వెల్లడించారు.