బండి సంజయ్ పాదయాత్ర నేటితో వెయ్యి కి.మీలు పూర్తి

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారంతో  వెయ్యి కి.మీల మైలు రాయిని అధిగమించబోతోంది. పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రామంలో రాత్రికి వెయ్యి కి.మీల మైలు రాయికి చేరుకోనున్నారు.
 
తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడం, వారికి భరోసా ఇవ్వడంతోపాటు టీఆర్ఎస్ కుటుంబ-అవినీతి-నియంత పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఇప్పుడు మూడో దశ జరుగుతున్నది. మూడో దశలో 14వ రోజున ఈ మైలు రాయి అధిగమించనున్నారు. 
 పాలకుర్తి నియోజకవర్గంలోని ధర్మతండా క్రాస్ రోడ్ సమీపంలో వెయ్యి కి.మీల మైలు రాయిని అధిగమిస్తుండటంతో ఈ ప్రాంతంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు చేసేందుకు సిద్ధమయ్యారు.   మొదటి విడత ఆగస్టు 28న పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైన సంగతి తెలిసిందే.
 అక్టోబర్ 2న హుస్నాబాద్ లో ముగిసింది. తొలివిడతలో మొత్తం 36 రోజులపాటు పాదయాత్ర చేసి 438 కి.మీలు నడిచారు. 19 అసెంబ్లీలో 9 జిల్లాలు, 6 ఎంపీ సెగ్మెంట్లలో పాదయాత్ర చేశారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద రెండో విడత పాదయాత్రను ప్రారంభించిన బండి సంజయ్ మే 14న తుక్కుగూడలో ముగించారు. మొత్తం 31 రోజులపాటు పాదయాత్ర చేసిన సంజయ్ 3 ఎంపీ, 9 అసెంబ్లీ, 5 జిల్లాల మీదుగా 383 కి.మీలు నడిచారు.
తాజాగా కొనసాగుతున్న మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న ప్రారంభమైంది. సోమవారంతో 13 రోజుల పాదయాత్ర చేసి 168.5 కి.మీలు నడిచారు. మంగళవారంమరో 16 కి.మీలు పాదయాత్ర చేయనున్నారు.  దానితో మొత్తం మీద వెయ్యి కి.మీల మైలు రాయిని  అధిగమించబోతున్నారు. అయితే రాత్రి బాగా పొద్దు పోయే అవకాశం ఉండటంతో మరుసటి రోజు బుధవారం ఉదయం బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున సంబురాలకు సిద్ధమయ్యారు.