బుద్గాంలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీరులోని బుద్గాం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు  చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. పలువురు పౌరులను హత్య చేసిన ఉగ్రవాది లతీఫ్ బుధవారం నాటి ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నాడని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ చెప్పారు. 
 
బుధవారం తెల్లవారుజామున బుద్గాంలోని జలపాతం వద్ద పోలీసులు,భద్రతా బలగాలు కలిసి గాలిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారని కశ్మీర్ జోన్ పోలీసులు బుధవారం ఉదయం ట్వీట్ చేశారు.
 
మే నెలలో కశ్మీర్ పండిట్ అయిన ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ ను ఇద్దరు ఉగ్రవాదులు కాల్చిచంపారని పోలీసులు చెప్పారు. బుద్గాంలోని చదూరాలో కశ్మీరీ టీవీ యాక్టర్ అమ్రీన్ భట్ ను గుర్తుతెలియని ఉగ్రవాదులు మే 26వ తేదీన కాల్చి చంపారు.శ్రీనగర్ పోలీసులు ఆదివారం లావేపురా వద్ద ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
 
ఉగ్రవాదుల నుంచి 5 పిస్టళ్లు, 5 మ్యాగజైన్లు, 50 రౌండ్ల తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాది నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన 78 ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు 127 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. వారిలో 33 మంది పాకిస్థానీలు ఉన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్‌లో 16 మంది భద్రతా సిబ్బంది, 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.