జాతీయ ప్రయోజనాలే పరమావధి కావాలి

రాజకీయంగా, సిద్ధాంతపరంగా ఎన్ని విభేదాలున్నా పార్లమెంటు సభ్యులకు జాతీయ ప్రయోజనాలే పరమావధి కావాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్భోదించారు. కుల, మత, లింగ, ప్రాంత విభేదాలకు దాటుకుని భారతదేశమే ప్రథమం (నేషన్ ఫస్ట్) భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే పార్లమెంటులో ప్రజోపయోగ చట్టాలపై చక్కటి చర్చలు జరిగేందుకు వీలవుతుందని చెప్పారు.  అప్పుడే మన రాజ్యాంగ నిర్మాతలు, నాటి నేతలు కలలుగన్న ప్రజాస్వామ్య భారత నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
సోమవారం సాయంత్రం పార్లమెంట్ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్  ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్  హరివంశ్, రాజ్యసభలో అధికార పక్ష నేత పీయూష్ గోయల్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సహా కేంద్ర మంత్రులు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఐదేళ్లపాటు భారతదేశ రెండో అతిపెద్ద రాజ్యాంగ హోదాలో, రాజ్యసభ చైర్మన్ గా పనిచేయడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్ గా సభా కార్యక్రమాల నిర్వహణను విజయవంతంగా చేపట్టడంలో అన్న పార్టీలు సహకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సభా మర్యాదలు కాపాడటం, సభ్యులకు గౌరవం కల్పించేందుకే చాలా సార్లు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
 
భారతీయతకు, మన సంస్కృతి, సంప్రదాయాలకే తానెప్పుడూ పెద్దపీట వేశానని, దేశమే ప్రథమం, తర్వాతే వ్యక్తిగత అన్న నినాదాన్ని పాటించానని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజలతో మమేకం కావడం ద్వారా చాలా విషయాలు తెలుస్తాయని చెప్పారు. 
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం జరుపుకుంటున్న తరుణంలో మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకుని వాటి ప్రేరణతో నవభారత నిర్మాణానికి సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెబుతూ  ఇందులో ఎంపీలు పోషించాల్సిన పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి తెలిపారు.
 
భారతదేశంలో యువశక్తి ప్రతిభాపాటవాలకు కొదువలేదని, వాటికి పదునుపెట్టి సరైన అవకాశాలు కల్పించి సద్వినియోగ పరుచుకుంటే భారతదేశం అంతర్జాతీయ యవనికపై అద్భుతాలు సృష్టించగలదని ఉపరాష్ట్రపతి చెప్పారు. ఈ దిశగా ఎంపీలు దృష్టిసారించాలని సూచించారు. 
 
భారతదేశం స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకుని 75 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ.. ఇంకా లింగ వివక్ష, పేదరికం, నిరక్షరాస్యత ఉన్నాయని, వీటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషిచేయాలని ఆయన సూచించారు. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినపుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని చెబుతూ ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల సహనంతో వ్యవహరించడం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం, విపక్షాలు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుని ముందుకెళ్లాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
 
పార్లమెంటులో, అసెంబ్లీల్లో సీనియర్ నాయకులు మాట్లాడిన ప్రసంగాలను వినడం, వారి రచనలు చదవడం ద్వారా విషయావగాహన పెరుగుతుందని, అది యువ ఎంపీలకు ఎంతగానో ఉపయుక్తం అవుతుందని చెప్పారు. పార్లమెంటు ఉభయసభల్లో ఇటీవలి కాలంలో కొత్తగా వచ్చిన ఎంపీలు చాలా చక్కగా మాట్లాడుతున్నారని, అలాంటి వారికి తాను ఫోన్ చేసి మరీ అభినందిస్తానని ఆయన గుర్తు చేశారు. 
 
ఈ ఐదేళ్లలో తనకు అన్నిరకాలుగా సహకరించిన ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, విపక్ష పార్టీ నేతలు, ఎంపీలు, డిప్యూటీ చైర్మన్, ప్యానెల్ ఆఫ్ చైర్మన్స్ కు ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు. 
 
అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తాను కార్యకర్తగా ఉన్నప్పటినుంచీ వెంకయ్యనాయుడుతో ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పరిష్కారంతో ముందుండేవారని, పార్టీ విషయంలోనైనా, ప్రభుత్వం పరంగానూ ఆయన చేసిన సూచనలు తనకు మార్గదర్శనం చేశాయని తెలిపారు.
 
కరోనా సమయంలోనూ తన రాజకీయ జీవితంలో తారసపడిన దాదాపు ప్రతి ఒక్కరికీ ఉపరాష్ట్రపతి ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారని, ఇది అసలైన ప్రజానాయకుడి లక్షణమని ప్రధాని పేర్కొన్నారు. మాతృభాషల పరిరక్షణ కోసం ఉపరాష్ట్రపతి చేసిన కృషిని ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా కష్టపడతామని ఆయన చెప్పారు.