అమరావతి రాజధాని విషయంలో బీజేపీకి మరో మాట లేదు

రైతుల త్యాగాలు వృధా కావని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భరోసా ఇచ్చారు. బీజేపీ సహకారం తోనే రాజధాని కల సాకారం అయ్యిందని, ఎన్నో కేంద్ర సంస్థలు, రోడ్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేస్తూ అమరావతి ని దృష్టిలో పెట్టుకొనే కేంద్రం సహకరించింది ఆయన తెలిపారు.
 
మూడు రోజులు ఎస్. సి మోర్చా ప్రశిక్షణ సదస్సు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ విభజన చట్టం పరిశీలన చేయమని చెబితే ఆచరణ లోకి తీసుకొచ్చిన ఘనత బీజేపీదే అని స్పష్టం చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని దూషించడం వల్లే పరాజయం పాలయ్యాడని, మరోవంక,  జగన్ పాదయాత్ర చేసి జనాల్ని నమ్మించాడని తెలిపారు. 
 
మేకల మధ్య వున్న పులి అదను చూసి బలి తీసుకున్నట్టు.. జగన్ జనాల మధ్య తిరుగుతూ ఇప్పుడు జనాలను బలి తీసుకుంటున్నాడని కన్నా మండిపడ్డారు. జగన్ ఇచ్చే పధకాల కంటే మోదీ  ఇస్తున్న పధకాలు ఎక్కువని అని చెప్పారు. ఇసుక, మద్యం, మైనింగ్ వంటి వాటి వల్ల వచ్చే ఆదాయం క్రైంకర్యం జగన్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 
 
మద్యం ద్వారా వచ్చే ఆదాయం జగన్ ఖాతా లోకి వెళ్తుందని,  మైనింగ్ ఆదాయం 70%.. జగన్ కే వెళ్తుందని ఆరోపించారు. జగన్ ఇగోయిస్టు, పాసిస్టు అంటూ సొంత తల్లిని కూడా మోసం చేశాడని దుయ్యబట్టారు. చెల్లి కి తండ్రి ఆదాయం ఇవ్వాల్సి వస్తుందని జగన్ తరిమి వేశాడని ఆరోపించారు. 
 
భారత దేశం లో ఎవరూ చేయనంత అవినీతి జగన్ చేశాడని చెబుతూ కేంద్రం ఇచ్చిన ఇళ్లు పూర్తి చేయలేదని విమర్శించారు.  జగన్ ఇచ్చిన స్థలాలు ఒక  కుంభకోణం అంటూ తక్కువ రేటు కి స్థలం సేకరించి ఎక్కువ రేటుకు కొని స్థానిక శాసన సభ్యులు, సీయం దోచుకున్నారని ఆరోపించారు. 
 
 మూడేళ్ల లో జగన్ చేసింది ఏమీ లేదని చెబుతూ ఒక్క పరిశ్రమ రాలేదు అని, వున్న పరిశ్రమలు కూడా వెళ్లి పొయాయని,.రోడ్ల పరిస్థితులు అద్వానం అని విమర్శించారు.  శాసన సభ్యుల భూకబ్జాలు పెరిగి పోయాయని చెప్పారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాసులు జగన్ మనుషులను చూసి బెదిరిపోతున్నారని ధ్వజమెత్తారు. 
 
టీచర్స్ మీద కోపం తో స్కూళ్లు విలీనం చేశాడని, విద్యుత్, బస్సు చార్జీ లు పెంచాడని,  తెచ్చిన అప్పులు కూడా ఏమై పొయ్యాయో అర్థం కావడం లేదని వివరించారు. దేశంలో అత్యంత సంపన్నుడు కావాలన్నదే జగన్ లక్ష్యం అంటూ  పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తున్నారని కన్నా విమర్శించారురు. 
 
సాక్షిలో పని చేసే ఉద్యోగులకు ప్రజల సొమ్ము జీతాలు గా ఇస్తున్నారని చెప్పారు. జగన్ ని తరిమి కొట్టడం లక్ష్యంగా బీజేపీ సాగాలని పిలుపిచ్చారు.  ప్రజలకు పది రూపాయలు ఇచ్చి రూ  100 తీసుకుంటున్నాడని అంటూ మోదీ  అట్టడుగు స్థాయి నుండి వచ్చి ప్రజలకు ఆదర్శంగా వున్నారని కొనియాడారు. అవినీతి లేని వ్యవస్థ నిర్మాణం చేశారని చెబుతూ మోదీ  పాలన వస్తేనే రాష్టానికి భవిష్యత్తు అని కన్నా స్పష్టం చేశారు.