నీతి ఆయోగ్పై కేసీఆర్ ఆరోపణలు నిరాధారం

ఆదివారం ఢిల్లీలో జరిగే  నీతి ఆయోగ్ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు  ప్రకటించడమే కాకుండా, నీతి ఆయోగ్‌ నిరర్ధక సంస్థగా మారిందని, మేథోమథనాన్ని ఆపేసి.. భజన బృందంగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర విమర్శలు చేయడం పట్ల ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
ఆ ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేస్తూ, ఆగస్టు 7న జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనకూడదని నిర్ణయించుకొని, నిరాధార ఆరోపణలతో సమస్యలను రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని తెలిపింది. గవర్నింగ్ కౌన్సిల్ అనేది టీమ్ ఇండియా అత్యున్నత స్థాయిలో చర్చించి, దేశాభివృద్ధికి సత్ఫలితాలిచ్చే పరిష్కారాలను సూచించే వేదిక అని గుర్తు చేసింది. రాష్ట్ర స్థాయిల్లో అభివృద్ధి, సమస్యలు చర్చించి, జాతీయ నిర్ణయాలు తీసుకునే వేదిక అని స్పష్టం చేసింది. 
బలమైన దేశం, బలమైన రాష్ట్రాలను తయారు చేయాలనే ఉద్దేశ్యంతోనే నీతి ఆయోగ్ ఒక సంస్థగా ఏర్పాటు చేయబడిందని నీతి ఆయోగ్ తెలిపింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పని చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని,  గత ఏడాదిలోనే నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 30కి పైగా సమావేశాలు నిర్వహించారని వెల్లడించింది.
వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో రాష్ట్రాలకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కరించామని, కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి మార్గం సుగమం చేశామని స్పష్టం చేసింది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సమస్యలపై చర్చించేందుకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గతేడాది జనవరి 21న హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిందని పేర్కొంది.
ఇటీవల నీతి ఆయోగ్ సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అన్ని సమస్యలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోందని నీతి ఆయోగ్ తెలిపింది.
 
‘‘ఆదివారం జరిగే పాలక మండలి సమావేశానికి సన్నాహకంగా… తెలంగాణతో సహా కేంద్ర, రాష్ట్రాల మధ్య వివరణాత్మక సంప్రదింపులు జరిగాయి. జూన్ నెలలో ధర్మశాలలో ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శితో సహా, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఎజెండా తయారీలో రాష్ట్రాలు సహకరించడం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోపణ సరికాదు” అని స్పష్టం చేసింది. 
 
నీటి రంగానికి సంబంధించి, 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ కింద  కేంద్రం రూ.3,982 కోట్లను కేటాయించింది. దానిలో తెలంగాణ కేవలం రూ. 200 కోట్లు మాత్రమే వినియోగించింది. 2014–2022 మధ్య కాలంలో తెలంగాణకు పిఎంకెఎస్ వై- ఎఐబిపి- సీడీడ్బ్ల్యూఎం కింద రూ.1,195 కోట్లు విడుదలయ్యాయని గుర్తు చేసింది. 
 
“జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌లు, కార్యక్రమాలతో సహా ఆర్థిక విషయాల్లో రాష్ట్రాలకు కేంద్రం  మద్దతుగా నిలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రాలకు నిధులు కేటాయింపు గణనీయంగా పెరిగింది. 14వ ఆర్థిక సంఘం నిధులు 32% నుంచి 42%కి పెంచింది. కేంద్ర పథకాల కింద కేటాయించిన నిధుల వినియోగానికి తగినంత సౌలభ్యం కూడా కల్పించింది.’’ అని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.