మంకీపాక్స్‌ కట్టడికి కేంద్రం ప్రత్యేక టాస్క్ ఫోర్స్

దేశంలో ఆందోళన కలిగిస్తోన్న మంకీపాక్స్‌ వైరస్‌ కేసుల కట్టడికిగానూ  కేంద్రం అప్రమత్తమయ్యింది. మంకీపాక్స్‌ కేసుల పర్యవేక్షణ-కట్టడి కోసం ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఆరోగ్యశాఖ అధికారులతోపాటు దేశంలోని ప్రధాన వైద్య, పరిశోధనా సంస్థల ప్రతినిధులూ సభ్యులుగా ఉంటారు. ఇటీవల నిర్వహించిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్రీకృత టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మంకీపాక్స్‌ వైరస్‌ నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు, వ్యాక్సిన్‌ తయారీ, తదితర అంశాలపై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ తగు సూచనలు చేస్తుంది. ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ దేశంలో మంకీపాక్స్‌ కేసుల నిర్వహణలో ఈ టాస్క్‌ఫోర్స్‌ సహాయపడుతుందని తెలిపారు.

భారత్‌లో ఇప్పటి వరకు నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు కేరళలో నమోదు కాగా, మరొకటి ఢిల్లీలో వెలుగుచూసింది. ఈ క్రమంలోనే కేరళలో మంకీపాక్స్‌ లక్షణాలతో ఓ 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అతని నమూనాలను పరీక్షలకు పంపగా మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి సోమవారం వెల్లడించారు.

అయితే, భారత్‌కు వచ్చేముందే యూఏఈలో అతనికి మంకీపాక్స్‌ పాజిటివ్‌గా తేలగా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని వైద్యుల వద్ద దాచిపెట్టినట్లు అతని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా,  రాజస్థాన్  రాష్ట్రంలో మంకీపాక్స్ అనుమానిత కేసు తాజాగా వెలుగుచూసింది. 20 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మంకీపాక్స్ అనుమానిత రోగి నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం పూణేలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించామని రాజస్థాన్ హెల్త్ యూనివర్శిటీ సూపరింటెండెంట్ డాక్టర్ అజిత్ సింగ్ చెప్పారు. కిషన్ ఘడ్ పట్టణానికి చెందిన యువకుడికి మంకీపాక్స్ లక్షణాలుండటంతో అతని కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసి పరిశీలనలో ఉంచామని వైద్యులు చెప్పారు.

మంకీపాక్స్‌ కేసుల కట్టడి చర్యల్లో భాగంగా బెంగళూరు ఆరోగ్యమంత్రిత్వశాఖ 21 రోజుల పాటు ఐసోలేషన్‌ను విధించనున్నట్లు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కేసుల్ని గుర్తించడానికి విమానాశ్రయాలు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లలోనూ బృందాలుగా ఏర్పడి పరీక్షల్ని నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. కమ్యూనిటీలోని అనుమానిత కేసులు, ఆసుపత్రిలోని నిఘా లక్ష్యంగా పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యమంత్రిత్వశాఖ మార్గదర్శకాలిచ్చింది.