ఐసిస్‌తో ఉగ్ర లింకులపై 8 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

* ఎన్‌ఐఏ అదుపులో ఆర్మూర్ వ్యక్తి

భారత్‌లో ఐసిస్‌ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం 8 రాష్ట్రాల్లో దాడులు చేసింది. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. స్థానికులకు ఐసిస్‌తో ఉగ్ర లింకులపై ఆరాతీసింది.

మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కేరళల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేసి నేరమయ డాక్యుమెంట్లు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. యూపీలోని దేవ్‌బంద్‌లోని ఓ మదర్సాలో కర్ణాటకకు చెందిన ఫరూక్‌ అనే విద్యార్థిని ప్రశ్నించి పంపించారు. 

ఉగ్ర సంబంధాల ఆరోపణలపై కర్ణాటకలో ఇద్దరిని, తెలంగాణలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు పట్టణంలోని జిరాయత్‌ నగర్‌లో కూడా ఎన్‌ఐఏ ఆదివారం సోదాలు నిర్వహించి,  ఓ యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు. సదరు యువకుడికి విదేశాల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. 

 ఉత్తరప్రదేశ్‌లోని సహరణ్‌పూర్‌ జిల్లాలో ఒక మదర్సా విద్యార్థిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకొంది. కర్ణాటకకు చెందిన ఫరూక్‌ యూపీలోని దేవబంద్‌లో ఓ మదర్సాలో ఉంటున్నాడు. పాక్‌ ఐఎ్‌సఐతో అతనికి సంబంధాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఎన్‌ఐఏ ఫరూక్‌ను అదుపులోకి తీసుకొంది. 

ఐసి్‌సకు సంబంధించి నమోదైన ఓ కేసులో గుజరాత్‌లో ముగ్గురు అనుమానితులను ఎన్‌ఐఏ ప్రశ్నించింది. తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో తమిళనాడులోని ఆంబూరుకు చెందిన మీరా అనాస్‌ అలీ (22)ని అదుపులోకి తీసుకొంది. అతని గది నుంచి ఒక ల్యాప్‌టాప్‌, రెండు మొబైల్‌ ఫోన్లు సిమ్‌ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఉత్తర కన్నడ జిల్లా భట్కళ్‌లో ఐసి్‌సతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురిని ఎన్‌ఐఏ ఆదివారం అదుపులోకి తీసుకొంది. భట్కళ్‌కు చెందిన అబ్దుల్‌ మస్తిర్‌ (30), అతని సోదరుడు ఐసిస్‌ రచనలను భారతీయ భాషల్లోకి అనువదించినట్లు అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 ఉగ్రవాదులతో లింకులున్నాయన్న అనుమానంతో తుమకూరులో హెచ్‌ఎంఎ్‌స యూనానీ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని ఎన్‌ఐఏ బృందం ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. 

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్తలు సిరియా, పాకిస్తాన్‌కు వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకున్నారని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె ఆరోపించారు. బీజేపీ నేత ప్రవీణ్‌ నెట్టార్‌ను పీఎఫ్‌ఐయే హత్య చేసిందని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసు విచారణకు ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది.