పింగ‌ళి పేరిట త‌పాల స్టాంప్

పింగ‌ళి వెంక‌య్య రూపొందించిన అసలు జాతీయ జెండాని ఆగ‌స్టు 2న ప్ర‌ద‌ర్శిస్తామ‌ని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిష‌న్ రెడ్డి విజయవాడలో తెలిపారు.  జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి వేడుకల సందర్భంగా ఆగస్టు 2 న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 
 
ఆదివారం ఆయన  పింగళి వెంకయ్య స్వగ్రామాన్ని సందరించారు. శత జయంతి వేడుకలకు పింగళి కుటుంబ‌ సభ్యులను ప్రధాని తరుఫున ఢిల్లీకి ఆహ్వానిస్తున్నట్లు, పింగళి పేరిట తపాల స్టాంప్‌ను కూడా విడుదల చేయనున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. 
 
అదేవిధంగా పింగళి కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ, అమిత్‌ షా సన్మానిస్తారని ఆయన వివరించారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా పేరిట వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా దేశంలోని ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. 
 
ఈ సందర్భంగా త్యాగధనుల గురించి తెలుసుకునేలా కార్యక్రమాలు చేపట్టామని , ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.