ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.7798 కోట్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక సహాయచర్య ( ప్రత్యేక ప్యాకేజీ) అమలులో ఉందని,  17 ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌ల (ఈఏపీ) కోసం రూ.7798 కోట్లు మంజూరు చేసిందని రాజ్యసభలో  ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం 17 ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌లకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు.
ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా  పార్లమెంట్‌లో ఇచ్చిన వివిధ హామీలు, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు, కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అవసరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2015 మార్చి 15న ఈఏపీ నిధులతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టుల జాబితాలో విశాఖపట్నం-చెన్నై కారిడార్ ప్రాజెక్ట్ (రూ. 1859 కోట్లు), ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసే ప్రాజెక్ట్ (రూ. 935 కోట్లు), ఆంధ్రప్రదేశ్ పవర్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్ (897 కోట్లు), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (825 కోట్లు) ఉన్నాయి.
ప్రత్యేక ప్యాకేజీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందా? అని జీవీఎల్ అడిగిన ప్రశ్నకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని, మే 2వ తేదీ 2017న లేఖ ద్వారా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు కూడా తెలిపారని పంకజ్ చౌదరి గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీలో 100 శాతం కేంద్రప్రభుత్వ నిధులతో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా అమలు చేయడానికి నిర్ణయాలు కూడా తీసుకున్నారని వివరించారు.
కాగా, 2107 మార్చిలో నాటి సీఎం చంద్రబాబు అభ్యర్ధన మేరకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కేంద్రం ప్రకటించిందని  జివిఎల్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ గుర్తు చేశారు. ప్యాకేజీలో ఒప్పుకున్న ప్రకారం ఈ రుణాలన్నీ కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది కాబట్టి ఆ భారం రాష్ట్రంపై పడదని స్పష్టం చేశారు. వడ్డీతో కలుపుకుంటే రూ 9-10 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం ఆంధ్ర ప్రజలకు అందుతోందని ఆయన వివరించారు.
రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఇప్పటికే అప్పుల్లోకి నెట్టేసిన పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన ఈ ఆర్థిక సహాయం రాష్ట్రానికి లాభమేనని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2014 నాటికి ఏపీ అప్పు రూ 97,123.93 కోట్లు కాగా, ఈ మార్చికి రూ 3.98 లక్షల కోట్లకు చేరిందని జీవీఎల్ తెలిపారు. అప్పుల ఊబికి అధికారంలో ఉన్న రెండు పార్టీలు టీడీపీ, వైఎస్సార్సీపీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
టీడీపీ హయాంలోనే ఏపీ అప్పు రూ. 2,64,451 కోట్లకు చేరిందని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతూ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతో రుణాలు సేకరిస్తున్నట్టు ఆర్బీఐ నివేదికలోనే పేర్కొందని ధ్వజమెత్తారు. ఇవి బడ్జెట్ పరిధిలో లేని అప్పులు అని స్పష్టంగా తెలుస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ తరహాలో చేస్తున్న రుణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాల్లో భాగంగానే పరిగణిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసిందన్న జీవీఎల్, ఇలాంటి అప్పులన్నీ కలిపితే ఏపీ అప్పుల మొత్తం రూ 6 లక్షల కోట్లు దాటుతుందా అనిపిస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్ వెలుపల ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేస్తున్న రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందని జివిఎల్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు తగ్గించి, నాన్ మెరిట్ ఉచిత పథకాలను తగ్గించాలని, ఆర్థిక వనరులను బెరీజు వేసుకొని సంక్షేమ పథకాలు అమలు చేయాలని జీవీఎల్ నరసింహారావు హితవు పలికారు. అనవసర ఆర్భాటాలు, వందల సంఖ్యలో సలహాదారులు వంటి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.