రామగుండంలో ఇఎస్ఐ ఆసుపత్రికి స్థలం ఇవ్వండి కేసీఆర్!

రామగుండంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించదలచిన 100 పడకల ఇఎస్ఐ  ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఓ లేఖ వ్రాసారు. కార్మికులకు అవసరమైన వైద్య సేవలను మరింత సులభంగా పొందటానికి వీలుగా రామగుండంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని నిర్మించ తలపెట్టిన్నట్లు ఆయన తెలిపారు.
ఈ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామగుండం పట్టణ శివార్లలో చూపించిన్నట్లు రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి కేంద్రానికి లేఖ వ్రాసారని, ఆ భూమి పరిశీలన కోసం హైదరాబాద్ లోని ఇఎస్ఐ  ప్రాంతీయ కార్యాలయం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు.
ఈ కమిటీ సభ్యులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రభుత్వం చూపించిన భూమిని పరిశీలించి అందించిన నివేదికలో ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించిన భూమిని గతంలో రామగుండం మునిసిపాలిటీ వారు డంపింగ్ యార్డుగా ఉపయోగించేవారని, భూమికి చుట్టుప్రక్కల 2 స్మశాన వాటికలు ఉన్నాయని తెలిపారని కేంద్ర మంత్రి చెప్పారు.
అంతేకాకుండా ఈ భూమిని చేరుకోవడానికి నేరుగా దారి లేదని, ప్రస్తుతం భూమి ప్రక్కనే ఉన్న పార్కు మధ్యగా నడిచి వెళ్లాలని, బస్టాండు లేదా రైల్వే స్టేషన్ నుండి కార్మికులు ఇక్కడకు చేరుకోవడానికి కూడా దూరమవుతుందని తెలిపారు. కార్మికులకు అనుకూలంగా లేని అనేక కారణాల రీత్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపించిన భూమి ఆసుపత్రి నిర్మాణానికి అనువైనది కాదని భూమి పరిశీలన చేసిన నిపుణుల కమిటీ సభ్యులు స్పష్టం చేసింది.
 
కాబట్టి, కార్మికుల రాకపోకలకు వీలుగా ఉండేలా ఆసుపత్రి నిర్మాణానికి అనువైన ప్రత్యామ్నాయ భూమిని చూపించి వెంటనే కేటాయించేలా చూడాలని కిషన్ రెడ్డి కేసీఆర్ ను కోరారు. ఇప్పటికే ఆలస్యం అయిన ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కావలసిన భూమి కేటాయింపు త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.