ఉద్యోగినులు ఇంటికి, వారి బదులు మగ బంధువులు..తాలిబన్ల హుకుం

అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మహిళలపై   క్రూర చర్యలు, పురుషాధిక్య విధానాలను అనుసరిస్తూ వివక్షతను మరింత తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా, మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా  సమీప బంధువుల్లోని మగాళ్లను పంపాలని ఆదేశించింది.
 
మతాచారాల ప్రకారం స్త్రీల బహిరంగ సంచారం, సామాజికతపై కట్టడి దిశలో తాలిబన్లు పలు కటుతర చర్యలకు పాల్పడటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ దశలో ఉద్యోగినులు ఉద్యోగాలు వీడాలనే పరోక్ష ఆదేశాలు వెలువరించారు. ఉద్యోగినులు తమ సమీప బంధువులైన మగవారిని తమ బదులు ఉద్యోగాలకు పంపించాలని ఫర్మానాలో తెలిపారు. 
 
తనకు తాలిబన్లనుంచి సదరు ఆదేశాలు అందాయని దేశంలోని మహిళా ఉద్యోగి ఒకరు వార్తా సంస్థలకు తెలిపారు. స్త్రీలు పని ఒత్తిడిని తట్టుకోలేరు. వీరి బదులు మగవారిని ఉద్యోగాలకు తీసుకుంటామని, కుటుంబ జీవనాధారం పోకుండా ఉండాలంటే ఉద్యోగినులు తమ ఇంటి మగవారిని పంపించి డ్యూటీలు చేయించాలని ఆదేశాలలో తెలిపారు.
 
గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు దేశాధికారం చేపట్టినప్పటి నుంచి వెలువరిస్తూ వస్తున్న పలు డిక్రీలు మహిళల హక్కుల భక్షణ దిశలో ఉంటున్నాయి. తాలిబన్ల అధికారం ఆరంభం నుంచి తన వేతనం భారీగా తగ్గుతూ వచ్చిందని ఓ ఉద్యోగిని తెలిపింది. ఇంతకు ముందు తనకు 60,000 అఫ్ఘనీలు వచ్చేవి. అయితే వీటిని ఇప్పుడు నెలకు 12,000 అఫ్ఘనీలుగా మార్చివేశారని ఓ మహిళా ఉద్యోగి వాపొయారు. 
 
ఇప్పుడు ఏకంగా తన బదులు మగవారిని ఉద్యోగాలకు పంపించాలని డిక్రీలు వెలువరించారని ఇదేం న్యాయం అని ఆమె ప్రశ్నించారు. ఇదేమిటని తాను ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే బయటకు వెళ్ళు, జీతాల కుదింపులపై మారుమాటలు లేవని గదమాయించారని చెప్పారు.  తాను కీలకమైన ఆర్థిక లావాదేవీల విభాగంలో ఉన్నానని, జీతం తగ్గింపుతో పలు రకాల ఖర్చుల బడ్జెట్ తలకిందులు అయిందని ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు.
 
తాలిబన్ల తీరును అంతర్జాతీయ సమాజం కూడా తీవ్రంగా తప్పుపట్టింది. మహిళలపై ఆంక్షల వల్ల అఫ్గాన్ ఆర్థికంగా ఒక బిలియన్‌ డాలర్లు (అఫ్గాన్ జీడీపీలో 5 శాతం)  నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ సిమా బాహౌస్ మే నెలలోనే అంచనా వేశారు. అఫ్గాన్ పేదరికంలోకి వెళ్లిందని, ఒక తరం మొత్తానికి ఆహార భద్రత, పోషకాహార లోపం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.