సింగపూర్ ఓపెన్ టైటిల్ -2022ను కైవసం చేసుకున్న పివి సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పివి సింధు తొలి సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యిపై 21-9, 11-21, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి సెట్‌లో ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు రెండో సెట్‌లో ఓడిపోయింది.
 
అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో తిరిగి అద్భుతంగా పుంజుకున్న సింధు  ఈ ఏడాదిలో తొలి  సూపర్‌ 500 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా వాంగ్ జి యి చివరి వరకు అద్భుతమైన రీతిలో పోరాడింది. ఇక పివి సింధుకు ఈ ఏడాది సీజన్‌లో ఇది మూడో టైటిల్‌. అంతకుముందు సయ్యద్‌ మోడీ, స్విస్‌ ఓపెన్‌లో  సూపర్‌ 300 టైటిల్స్‌ను సింధు సాధించింది. 
 
ఇక ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత ప్లేయర్‌గా  సింధు రికార్డులకెక్కింది.  కాగా గతంలో 2010లో సైనా సెహ్వాల్, 2017లో సాయి ప్రణీత్  సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
 
సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ” తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నందుకు పీవీ సింధుని నేను అభినందిస్తున్నాను. ఆమె మరోసారి తన అసాధారణమైన క్రీడా ప్రతిభను ప్రదర్శించి విజయం సాధించింది. ఇది దేశానికి గర్వకారణం.. రాబోయే క్రీడాకారులకు కూడా స్ఫూర్తినిస్తుంది” అని ప్రధాని ట్వీట్ చేశారు.