ఇంగ్లండ్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం, సిరీస్ కైవ‌సం

ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చూపింది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో టాప్ క్లాస్ ఆట‌తీరుతో క్రికెట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన అఖరిలో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.
అయితే ఈ సిరీస్‌లోనూ విరాట్ కోహ్లీపై అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకునున్నారు. కానీ, అంద‌రూ అనుకున్న స్థాయిలో అత‌ను మెప్పించలేక‌పోయాడు.  కాగా భారత విజయంలో పంత్‌, హార్ధిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించారు. పంత్ ‌(113 బంతుల్లో 125 నాటౌట్‌; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు)  వీరోచిత సెంచరీతో చెలరేగగా.. హార్ధిక్‌ బంతితోను, బ్యాట్‌తోను అద్భుతంగా రాణించాడు.
బౌలింగ్‌లో కేవలం 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన హార్ధిక్‌.. బ్యాటింగ్‌లో 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కాగా పాండ్యాకు తన వన్డే కెరీర్‌లో ఇవే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌ రౌండ్‌ షోతో అదరగొట్టిన పాండ్యా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మూడు వ‌న్డేల సిరీస్‌లొ తొలి వ‌న్డేలో బౌల‌ర్లు మిరాకిల్ చేశార‌నే చెప్ప‌వ‌చ్చు. బుమ్రా ఏకంగా ఆరు వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. ఇక‌, రెండో వ‌న్డేలో ఇంగ్లండ్ జ‌ట్టు త‌న ప్ర‌తాపాన్ని చూపింది. తామూ తీసిపోలేద‌ని, టీమిండియాకు దీటుగా ఆడి రెండో వ‌న్డేను గెలుచుకుంది.
కాగా, ఇరు దేశాల జ‌ట్ల‌కు కీల‌క‌మైన మూడో వ‌న్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జ‌ట్టు 259 ప‌రుగులు చేసింది. దీంతో టీమిండియా 260 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. కాగా, ఓపెన‌ర్లుగా దిగిన రోహిత్ శ‌ర్మ (17), శిఖ‌ర్ ధ‌వ‌న్ (1) పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయారు.
ఆ త‌ర్వాత బ‌రిలోకి వ‌చ్చిన కోహ్లీపై అంతా ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ కోహ్లీ కూడా (17) త్వ‌ర‌గానే పెవిలియ‌న్ చేరాడు. దీంతో టీమిండియా కీల‌క‌మైన మూడు వికెట్ల‌ను స్వ‌ల్ప స్కోరుకే చతికిలపడింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన రిష‌బ్ పంత్‌, సూర్య‌కుమార్ జ‌త‌క‌లిసి ఆడుతున్న‌క్ర‌మంలో సూర్య‌కుమార్ (16) త్వ‌ర‌గానే అవుట‌య్యాడు.
దీంతో టీమిండియా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి జారుకుంది. మ్యాచ్ ఇంగ్లండ్ చేతిలోకి వెళ్లింద‌నుకున్న త‌రుణంలో హార్ధిక్‌పాండ్యా వ‌చ్చి జ‌ట్టుకు ఊపిరి పోశాడు. పంత్‌తో క‌లిసి స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించారు. వీరిద్ద‌రి ఆట‌తీరుతో అభిమానుల్లో మ‌ళ్లీ ఆశ‌లు పెరిగాయి.
కాగా, పాండ్యా (71) ప‌రుగుల వ‌ద్ద అవుటుకాగా, పంత్‌కు రవీంద్ర జడేజా 7, తోడ‌య్యాడు. ఈ క్ర‌మంలో పంత్ త‌న సెంచ‌రీ పూర్తి చేసుకుని 125 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇండియాను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. టీమిండియా ఇంగ్లండ్​పై 5 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్​ కైవసం చేసుకుంది.
మూడు ఫార్మాట్లలో ఒకే మ్యాచ్ లో నాలుగు పైగా వికెట్లు తీసి 50 ప్లస్‌ పరుగులు చేసిన తొలి భారత్‌ క్రికెటర్‌గా పాండ్యా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా హార్ధిక్‌ నిలిచాడు. అంతకుముందు పాక్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ ఈ ఫీట్ సాధించాడు.
ఇక వన్డేలో ఫిప్టీ ప్లస్‌ పరుగులు నాలుగు వికెట్లు పడగొట్టిన ఐదో భారత ఆటగాడిగా పాండ్యా రికార్డులకెక్కాడు. అంతుముం‍దు కృష్ణమాచారి శ్రీకాంత్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించారు. మాంచెస్టర్‌లో వన్డేలలో అత్య్తుమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన మూడో భారత ఆటగాడిగా హార్దిక్‌ రికార్డు సృష్టించాడు.