ప్రపంచ దేశాల్ని పోషించగలిగే సత్తా గల భారత్‌

మొత్తం వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం ఉంటే మిగిలిన ప్రపంచ దేశాల్ని పోషించగలిగే సత్తా భారత్‌కు ఉంటుందని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా  ధీమా వ్యక్తం చేశారు. అమెరికా తర్వాత అత్యధికంగా మనదేశంలోనే 49.4 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని ఆయన గుర్తు చేశారు.
అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవల‍్మెంట్‌ బ్యాంక్స్‌ (ఏఆర్‌డీబీఎస్‌) మహసభలో మాట్లాడుతూ చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాలకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా సహకార బ్యాంకులు కృషి చేయాలని కోరారు. అంతేకాదు దేశంలో సాగునీటిని పెంచేందుకు సహకార బ్యాంకులు రుణాలు అందించడంపై దృష్టి సారించాలని ఆయన పిలుపిచ్చారు.
“గత 90 సంవత్సరాలుగా సహకార సంఘాల ద్వారా దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అందిస్తున్నాం. కాని అది కాస్త తగ్గినట్లు సంబంధిత డేటాను చూస్తే అర్ధమవుతుంది” అంటూ కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌లో అనేక అడ్డంకులు ఉన్నాయని, సహకార స్ఫూర్తితో వాటిని అధిగమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు.
సహకార బ్యాంకులు.. బ్యాంకులుగా మాత్రమే పని చేయకూడదని, నీటిపారుదల వంటి వ్యవసాయ మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి ఇతర సహకార కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని అమిత్‌ షా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.