రాష్ట్రపతిగా  ద్రౌపది ముర్ము ఎన్నిక ఇక లాంఛనమే!

దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి,  దేశ ప్రధమ పౌరుడుగా రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్దమైనది. సోమవారం జరిగే ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక ఇక లాంఛనంగానే కనిపిస్తున్నది. అనూహ్యంగా అనేక ప్రాంతీయ పార్టీలు  ఆమెకు మద్దతు ఇస్తూ ఉండడంతో అంచనాలు మించి,  61 శాతంకు పైగా ఓట్లతో ఆమె విజయం సాధించడం తధ్యంగా భావిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకి ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరి పోరు ఉన్నప్పటికీ ఎన్డీయే.. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. గతంలో వాజపేయి హయాంలో ఎన్డీయే అభ్యర్థి అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనా, బిజెపి సభ్యులు ఈ అత్యున్నత స్థానంకు చేరుకొంది మొదటగా ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్  కోవింద్ మాత్రమే. ఆయన తర్వాత ఆ గౌరవం ముర్ముకు దక్కనుంది.

ప్రాంతీయ పార్టీల్లో అత్యధికులు ముర్ముకే జై కొట్టడంతో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాతో పోరు ఏకపక్షంగా సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ద్రౌపది వెంట 44 పార్టీలు ఉంటే, సిన్హాకు మద్దతుగా 34 పార్టీలున్నాయి. బీజేడీ, వైఎస్సార్‌సీపీలతో పాటు శివసేన, జేఎంఎం, టీడీపీ, అన్నాడీఎంకే, బీఎస్పీ వంటి పార్టీలు ద్రౌపదికి మద్దతు ప్రకటించాయి.

దీంతో ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పీఠం అధిరోహించడం  ఇక  లాంఛనమనే చెప్పాలి. ముర్ము గెలిస్తే దేశానికి రెండో మహిళ రాష్ట్రపతి అవుతారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభకు నామినేట్‌ అయిన ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటింగ్‌లో పాల్గొనే అర్హత లేదు. ఓటింగ్‌ రహస్య పద్ధతిలో జరుగుతుంది. దీంతో క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశాలుంటాయి.

ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలెట్, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్‌ పత్రాలను ఇవ్వనున్నారు. బ్యాలెట్‌ పత్రాల్లో రెండు కాలమ్‌లు ఉంటాయి. అవే అభ్యర్థి పేరు, ఆర్డర్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌. పోటీపడుతున్న అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికో తప్పనిసరిగా వేయాలి. అప్పుడే ఓటు చెల్లుతుంది. రెండో ప్రాధాన్యత ఓటు ఐచ్ఛికం.

రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరిగితే, ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగుతుంది. ప్రతీ ఎంపీకి, ఎమ్మెల్యేకి ఓటు విలువ ఉంటుంది. రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జనాభా ఆధారంగా పరిగణిస్తారు. దీంతో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ఓటు విలువ మారిపోతుంది.  అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువని పార్లమెంటు సభ్యుల సంఖ్యతో భాగిస్తే వచ్చే దానిని ఎంపీ ఓటు విలువగా నిర్ధారిస్తారు. ఈ సారి జమ్ము కశ్మీర్‌ రాష్ట్రంగా లేకపోవడంతో 708గా ఉండాల్సిన ఎంపీ ఓటు విలువ 700కి తగ్గింది.

ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ ఎలక్టోరల్‌ కాలేజీగా వ్యవహరిస్తారు. 776 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, 4,120 మంది ఎమ్మెల్యేలు మొత్తంగా 4,896 మంది ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్ల విలువ 10,86,431 కాగా అందులో కనీసం 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలయిన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. అంటే 5,49,442కి పైగా ఓట్ల విలువ వచ్చిన వారు అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తారు.

ఇప్పటికే 44 పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతునివ్వడంతో ఆమెకు 6 లక్షలకు పైగా విలువైన ఓట్లు పోలవతాయని అంచనా. ఇంచుమించుగా మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమె విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.