భారత్ లో అశాంతిని రేకెత్తించేందుకు కుట్రలు 

 అనవసర అంశాలను ప్రేరేపిస్తూ భారత్ లో అశాంతిని రేకెత్తించేందుకు, మనదేశ సమగ్రతను దెబ్బతీసే లక్ష్యంతో కుట్రలు జరుగుతున్నాయని  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హెచ్చరించారు.  వీటిని సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు దేశ ప్రజలంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
దేశంలో అక్కడక్కడ ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనలు తనను ఎంతగానో కలచివేశాయన్న ఆయన, ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా భారతీయుల మనసుల్లో నాటుకుపోయిన సౌభ్రాతృత్వ భావన తిరిగి దేశాన్ని ఒక తాటిపైకి తెస్తుందని భరోసా వ్యక్తం చేశారు.
ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టు, విజయవాడ చాప్టర్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జాతీయ కవిచక్రవర్తిగా పేరు ప్రఖ్యాతులు పొందిన దామరాజు పుండరీకాక్షుడు జీవితం, సాహిత్యం గురించి పరిశోధించి రూపొందించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. భారతదేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్న ఆనందకర సమయంలో ఈ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అంటూ  పుస్తక రచయిత యల్లాప్రగడ మల్లికార్జురావును అభినందించారు.
 
తరతరాలుగా భారతీయుల మనసుల్లో పరమత సహనం అంతర్వాహినిగా ప్రవహిస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఈ స్ఫూర్తిని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ మరింత బలోపేతమైన ప్రజా శ్రేయస్కరమైన భారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో మనమంతా భాగస్వాములం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
 
 ఇవాళ్టి పరిస్థితుల్లో కుల, మత, ప్రాంత దురాచారాలను పారద్రోలాల్సిన అవసరం మరింత పెరిగిందని, కొంతకాలంగా సామాజిక మాధ్యమాల ద్వారా మన సంస్కృతిని కించపరిచేలా కొందరు చేస్తున్న పోస్టింగులు, ప్రకటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
 
 సమాజంలో వివాదాలను సృష్టించేందుకు కుట్రపన్నుతున్న దుష్ట శక్తులకు ఇలాంటి పోస్టింగులే ఊతం కల్పిస్తున్నాయని చెబుతూ ఇది అంగీకారయోగ్యం కాదన్న ఆయన, ఇది మన భారతీయత కాదని స్పష్టం చేశారు.  ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ నిరసించి, ప్రతిఘటించాలని సూచించారు.
ఆంగ్లేయుల నిరంకుశత్వాన్ని ధిక్కరిస్తూ, మహాత్ముడి స్ఫూర్తిని భారతదేశంలో ప్రతి గుండెకు చేర్చిన మహనీయులు ఎందరో ఉన్నారన్న ఉపరాష్ట్రపతి, వారి ప్రతి అక్షరం, ప్రతి నినాదం కోట్లాది భారతీయుల గొంతుకలై ప్రతిధ్వనించాయని తెలిపారు. నాడు స్వరాజ్య పోరాటం దిశగా ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతోపాటుగా సమరయోధుల త్యాగాలను సైతం జాతీయోద్యమ సాహిత్యం కళ్ళకు కట్టిందని ఆయన పేర్కొన్నారు.
 
 ప్రతి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా కావ్యాలు, ఖండికలు, కవితలు, గేయాలు, దండకాలు, శతకాలు, భజనలు, కీర్తనలు, బుర్రకథలు, కథలు, నవలలు ఇలా ఎన్నో ప్రక్రియలు సాహితీ ప్రపంచంలో తమదైన పాత్రను పోషించాయన్నారు. ఈ సందర్భంగా జాతీయోద్యమ సాహిత్య సుగంధాలు వెదజల్లిన పలువురు కవులు, రచయితలను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
 
స్వాతంత్ర్య సమరయోధుల్ని చిత్రహింసలకు గురి చేస్తున్న రోజుల్లో గాంధీజీని నాయకుడిగా చిత్రీకరిస్తూ దామరాజు పుండరీకాక్షుడు రాసిన నాటకం తెలుగు నాట ప్రసిద్ధి చెందిందన్న ఉపరాష్ట్రపతి, ఎన్నో ప్రబోధాత్మక రచనలు చేయడమే గాక, రామరాజ్యం అనే పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారని పేర్కొన్నారు. 
 
బ్రిటీష్ వారు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినా “గాంధీ లేనిది సాగదు నా కాలం” అంటూ నినదించిన వారి స్ఫూర్తి ఆదర్శనీయమని తెలిపారు. పుస్తకావిష్కరణ అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణార్థులకు ఉపరాష్ట్రపతి సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. గ్రామీణ యువత, మహిళలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి చేస్తోందన్న ఆయన, ఈ ఏడాది నుంచి గ్రాఫిక్స్ అండ్ డిజైన్ కోర్సు ప్రవేశపెట్టి, సాంకేతికంగా యువతను శక్తివంతం చేసేందుకు చొరవ తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, పుస్తక రచయిత  ఎల్లాప్రగడ మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.