ఎంపీ అరవింద్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి

జగిత్యాల జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడిచేశారు. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో బిజెపి నేత కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
తప్పును నిలదీస్తానన్న భయంతోనే తనను అడ్డుకున్నారని అర్వింద్ ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావే కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలతో తనపై దాడి చేయించిండని ఆరోపించారు. ఎర్దండి గ్రామంలో గోదావరినది వల్ల ముంపునకు గురైన వారిని పరామర్శించేందుకు వెళ్తుండగా,  టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని కార్లు ధ్వంసం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాసమస్యలు తెలుసుకోనివ్వకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డం పడుతున్నారని మండిపడ్డారు.  465 మంది గోదావరి ముంపు బాధితులకు ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చింది. అయితే లబ్దిదారులకు కేటాయించిన భూములను స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ బంధువులకు ఇప్పించుకున్నారని అర్వింద్ ఆరోపించారు.
ఈ విషయంపై నిలదీస్తానన్న భయంతోనే దాడికి ఉసిగొల్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  భారీ వరద వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని..నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని అర్వింద్ డిమాండ్ చేశారు.  కలెక్టర్లు వరద నష్టంపై అంచనాలు సరిగ్గా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని సూచించారు.
కేంద్రం నుంచి ఏం సాయం కావాలన్నా అందించే బాధ్యత తమదని చెప్పారు. అయితే, కేంద్రం అందించే సాయాన్ని కాళేశ్వరంలో ముంచవద్దని అర్వింద్ చురకలంటించారు. ఎప్పుడేం జరగుతుందో తెలియక ప్రజలు భయపడుతున్నారని,  సీఎం కేసీఆర్ కు తన కుటుంబ ఆస్తులపై తప్ప దేనిపై చిత్తం లేదని విమర్శించారు.
నాసిరకం నిర్మాణాల వల్లే చెక్ డ్యామ్లు కొట్టుకుపోయాయని అర్వింద్ ధ్వజమెత్తారు. వేల్పూర్ మండలం పచ్చల నడకుడ శివారులో వరదతో కొట్టుకుపోయిన చెక్ డ్యామ్లు, పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతంర కమ్మర్పల్లి లో  పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులను పరామర్శించారు.
వరదల వల్ల ఓ వ్యక్తి హోటల్ కూలిపోగా..అర్వింద్ అతడికి ఆర్థిక సాయం అందజేశారు. కాగా పంట నష్టం అంచనా వేసి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. ఫసల్ భీమా అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారన్న ఆయన, వరద నష్టంపై ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం నుంచి నిధుల వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు.

అరవింద్ కు అమిత్ షా ఫోన్ 

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.  అర్వింద్‌పై కొంతమంది టీఆర్ఎస్ నాయకులు దాడిపై కేంద్ర హోంమంత్రి  ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోందని  అర్వింద్‌ చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తిరిగిన దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఆదేశాలను ఇచ్చిందని అర్వింద్ చెప్పారు.  దాడి వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఉన్నారని ఎంపీ అర్వింద్ అమిత్ షా‌కు ఫోన్లో తెలిపారు.

దాడిపై సంజయ్ ఆగ్రహం 
బిజెపి ఎంపీపై టీఆర్ఎస్ నాయకుల దాడిపట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడడం సిగ్గుచేటని, ముమ్మాటికీ పిరికిబంధ చర్య అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని స్పష్టం చేశారు.