రెండు బ్యాగుల‍్లో 45 తుపాకులు భార్యాభర్తలు పట్టివేత

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి భారత్కు భారీ సంఖ్యలో తుపాకులు స్మగ్లింగ్ చేసిన భార్యాభర్తల్నికస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షలు విలువైన 45 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఇద్దరు జగ్‌జిత్‌ సింగ్‌, జస్విందర్‌ కౌర్‌లుగా అధికారులు గుర్తించారు. వారిద్దరినీ భార్యాభర్తలుగా నిర్ధారించారు.
 
ఈ నెల 10న ఆ దంపతులు వియత్నం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చారు. జగ్జీత్‌ వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 పిస్టల్స్‌ ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్‌ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తుపాకులపై ఆరా తీశారు. అయితే ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నుంచి విమానంలో వియత్నం వచ్చిన తన సోదరుడు మంజిత్‌ సింగ్‌ ఆ ట్రాలీ బ్యాగులను తనకు ఇచ్చినట్లు జగ్జీత్‌ సింగ్‌ తెలిపాడు.
 
కాగా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ)కి చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. దంపతులు జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ నుంచి స్వాధీనం చేసుకున్న 45 పిస్టల్స్ విలువ రూ.22.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. 
 
మరోవైపు  వీరిద్దరూ ఇలా తుపాకులను చేరవేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓసారి పిస్తోళ్లు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. టర్కీ నుంచి భారత్‌కు 25 తుపాకులు తెచ్చినట్లు విచారణ సందర్భంగా నిందితులు అంగీకరించారు  దీంతో బుధవారం వారిద్దరిని అరెస్ట్‌ చేసిన అధికారులు, గన్స్‌ అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నారు.