శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అరెస్ట్ కు భయపడి చివరకు దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్ 32 అనే సైనిక విమానంలో బుధవారం వేకువ జామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. గొటబాయతో పాటు ఆయన సతీమణి, బాడీగార్డులు కలిపి మొత్తం నలుగురు ఈ విమానంలో దేశం దాటారు.
గొటబాయ కుటుంబం మాల్దీవులకు వెళ్లిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. వారి పాసుపోర్టులపై స్టాంపులు వేసినట్లు పేర్కొన్నారు. తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే జులై 13న రాజీనామా చేస్తానని ప్రకటించారు గొటబాయ. సరిగ్గా అదే రోజు దేశం విడిచి పారిపోయారు. అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు గొటబాయను అరెస్టు చేయడానికి వీల్లేదు. రాజీనామా చేసిన తర్వాత తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే అంతకంటే ముందే ఆయన దేశం వీడి పారిపోయినట్లు తెలుస్తోంది.
తన కుటుంబాన్ని వెళ్లినిస్తేనే రాజీనామా చేస్తానని గొటబాయ అధికారులకు చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి, గొటబాయ సోమవారమే వాణిజ్య విమానంలో దుబాయ్ పారిపోవాలని ప్రయత్నించారు. అయితే ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది అతన్ని వీఐపీ టర్మినల్ ద్వారా వెళ్లనిచ్చేందుకు నిరాకరించారు.
సాధారణ ప్రజల్లా పబ్లిక్ కౌంటర్ నుంచే రావాలని సూచించారు. జనం తమను చూస్తే ఎక్కడ దాడి చేస్తారో అనే భయంతో ఆయన పబ్లిక్ కౌంటర్ వైపు వెళ్లలేదు. 24 గంటలు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో అవమానంతోనే వెనుదిరిగారు. చివరకు సైనిక విమానంలో బుధవారం వేకువజామున దేశం వీడారు.
మరోవంక, గొటబయా శ్రీలంకను విడిచిపెట్టేందుకు తాము సాయం చేశామనే వార్తలను భారత్ ఖండించింది. అదేవిధంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుమిట్టాడుతున్న శ్రీలంక ప్రజలకు మద్దతు ఇస్తామని పునరుద్ఘాటించింది. ఈ మేరకు శ్రీలంకలో భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. ‘శ్రీలంక నుండి గొటబయ పారిపోయేందుకు భారత్ సాయమందించిదన్న ఊహాజనిత, నిరాధారమైన మీడియా కథనాలను ఖండిస్తున్నాం’ అని పేర్కొంది.
More Stories
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి
కొవిషీల్డ్తో ప్రమాదకరమైన దుష్ప్రభావాలు