కీలకమైన రెండు లోక్ సభ ఉప ఎన్నికలలో కంచుకోట వంటి తమ స్థానాలను కోల్పోయి షాక్ లో ఉన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు రాష్ట్రపతి ఎన్నికలు మరో షాక్ కలిగిస్తున్నాయి. సొంత పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. మిత్రపక్షంగా ఉన్న సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) సహితం ఎదురు తిరగడంతో ఖంగు తినవలసి వస్తున్నది.
గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎడమొఖం, పెడమొఖంగా ఉంటూ వస్తున్న బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ ఇప్పుడు బిజెపి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు, ఎస్బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్ సహితం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని కాదని ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు
శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన విందుకు హాజరై, ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకి మద్దతుకోరుతూ సమాజ్వాదీ పార్టీ తరపున తననెవరూ పిలవలేదు. ఓటు వేయమనీ అడగలేదు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తనను ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపతి ముర్ముని కలిశాను. ఆమెకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నానని శివ్పాల్ యాదవ్ తేల్చి చెప్పారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించే విషయమై గురువారం అఖిలేష్ నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ కూటమి పార్టీలతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ప్రగతీశీల్ సమాజ్వాదీ పార్టీ-లోహియా అధ్యక్షుడు శివపాల్ యాదవ్తో పాటు ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్కు సైతం ఆహ్వానం అందలేదు.
ఈ క్రమంలోనే ఆగ్రహం, అసంతృప్తితో రగిలిపోతున్న ఈ ఇద్దరికీ ఆహ్వానం పంపి ఆదిత్యనాథ్ వారిని తమవైపు తిప్పుకున్నారు. రాజ్భర్ ఎస్బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు నెగ్గింది. కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తి లేదంటూనే.. అఖిలేష్పై ఓంప్రకాశ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
తాజాగా లోక్సభ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో అఖిలేష్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. 2012 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రి అయ్యింది కూడా కేవలం తండ్రి ములాయం వల్లేనని, అఖిలేష్ నిజానికి అంత అర్హత ఉన్నోడు కాదంటూ ఓంప్రకాష్ సంచలన వ్యాఖ్యలే చేశారు.
ద్రౌపది ముర్ముకు మద్ధతు ఇవ్వడంపై రాజ్భర్ మాట్లాడుతూ ఎస్పీతో కూటమిలోనే తాము కొనసాగుతామని, ఒకవేళ అఖిలేష్ గనుక బలవంతంగా వెళ్లిపొమ్మంటే బయటకు వచ్చేస్తామని ప్రకటించారు. ముర్ముకు మద్దతు విషయం పూర్తిగా తన సొంత నిర్ణయమని తెలిపారు.
ఇలా ఉండగా, అఖిలేష్ సొంత బాబాయ్ అయిన శివపాల్ యాదవ్ 2012-17 అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్న సమయంలో ‘నెంబర్ టూ’గా కొనసాగారు. 2018లో అఖిలేష్తో పొసగక బయటకు వచ్చి ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ-లోహియా పేరిట కొత్త పార్టీ పెట్టారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి అబ్బాయితో కలిసి చేతులు కలిపారాయన.
ఆ ఎన్నికల్లో.. జశ్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన నెగ్గింది మాత్రం సమాజ్వాదీ పార్టీ గుర్తు మీదే కావడం గమనార్హం. తాజాగా, పార్టీ కార్యక్రమాలకు అఖిలేష్ తనను పిలువకపోవడంపై మండిపడ్డారు. అఖిలేష్ రాజకీయ అపరిపక్వతే ఇందుకు కారణమని ధ్వజమెత్తారు.
సమాజ్వాదీ భాగస్వామ్య పక్షాలు కొత్త మార్గాల్లో పయనించేందుకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అఖిలేష్ తన సలహాలను పాటించివుంటే ఉత్తరప్రదేశ్లో పార్టీ పరిస్థితి భిన్నంగా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. భాగస్వామ్య పార్టీలు దూరమవ్వడానికి అఖిలేష్ యాదవ్కు రాజకీయ పరిపక్వత లేకపోవడమే కారణమని ధ్వజమెత్తారు.
More Stories
బ్రిజ్భూషణ్ టికెట్ను కొడుక్కి బిజెపి సీట్
రేవణ్ణ విదేశీ పర్యటనలో ప్రభుత్వ సంబంధం లేదు
లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం