గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా  కేసీఆర్?

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా? అని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న సీఎం హామీ ఏమైందని ఆయన నిలదీశారు. 2005లో పార్లమెంట్ లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించే చట్టం ప్రవేశపెట్టిందని..2006లో దీనికి పార్లమెంట్ ఆమోదం తెలిపిందని ఆయన గుర్తు చేశారు.
2014 వరకే 93,494 కుటుంబాలకు 3లక్షల 92 ఎకరాలకు హక్కు పత్రాలు కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. భూమి పుత్రులుగా జీవించే గిరిజనులకు అప్పటి ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చిందని, గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం వుందని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని ఈటల తెలిపారు. అసెంబ్లీలో జులై 19, 2019, అక్టోబర్ 1 2021, మార్చి 15 2022 న పోడు భూములపై కేసీఆర్ మాట్లాడారని ఆయన చెప్పారు.
 ‘‘పోడు భూముల వ్యవహరాన్ని తేలుస్తా. నేనే బయలుదేరుతా..అన్ని జిల్లాలకు పోదాం. నేనే కాదు మంత్రులు, అధికారుల్ని తీసుకొస్తా. వాళ్ల ముందే ప్రజాదర్బార్ పెట్టి ఇది పోడు భూమి..ఇది పట్టా అని తేల్చేస్తాం. ఇంచు భూమి కూడా అన్యక్రాంతం కానివ్వం. వారికి  రైతు బీమా, రైతు బంధు ఇస్తాం’’ అంటూ కేసీఆర్ ప్రకటించారని ఈటల గుర్తు చేశారు.
టీఆర్ఎస్ 2014, 2018 మ్యానిఫెస్టోలలో అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదం పరిష్కరించి యజమాన్య హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారని కానీ అది ఇప్పటివరకు అమలుకాలేదని ఈటల విమర్శించారు. కేసీఆర్ భూములు గుంజుకుని అమ్ముకునే బ్రోకర్ పని చేస్తుండని ఈటల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గిరిజనులపై దుర్మార్గమైన రీతిలో దాడులు చేస్తున్నారని పేర్కొంటూ దీనిని వెంటనే ఆపాలని ఈటెల డిమాండ్ చేశారు. గిరిజనుల జోలికి వెళ్తే చూస్తూ ఊరుకోమని ఈటల స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. గిరిజన బిడ్డను బీజేపీ దేశ అత్యున్నత పదవికి ఎంపిక చేస్తే..రాష్ట్రంలో మాత్రం గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఈటల మండిపడ్డారు.
టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది 
త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, ఇందుకు సీక్రెట్ ఆపరేషన్ నడుస్తున్నట్లు ఈటల రాజేందర్ వెల్లడించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని జోస్యం చెప్పారు. బీజేపీకి చెందిన నలుగురు కార్పోరేటర్లను టీఆర్ఎస్ చేర్చుకుంటే చూస్తూ ఊరుకుంటామా? టీఆర్ఎస్ పై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని స్పష్టం చేశారు.
కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే..ఈగోలు పక్కన పెట్టి లక్ష్యం కోసం పనిచేయాలని బీజేపీ నేతలకు ఆయన సూచించారు. బెంగాల్ లో సువేందు అధికారి తరహాలో కేసీఆర్ ను ఓడించి తీరుతానని తెలిపారు.  అర్జునుడికి పక్షి తల మాదిరి కేసీఆర్ మాత్రమే కనిపించాలని, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమైనట్లు తెలిపారు.  తన ప్రస్థానం మెదలైంది గజ్వేల్ నుంచేనని, ప్రశ్నించే తత్వం సహజంగానే తెలంగాణ మట్టిలో ఉందని ఈటల  పేర్కొన్నారు.