హోటల్స్‌, రెస్టారెంట్లలో ‘సర్వీస్‌ఛార్జ్‌’ బలవంతపు వసూళ్లకు చెక్‌

హోటల్స్‌, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్లకు.. ఇక నుంచి ‘సర్వీస్‌ ఛార్జీ’ బాదుడు నుంచి ఊరట లభించింది. వినియోగదారుల విషయంలో ఇష్టానుసారం వ్యవహరించకుండా ఉండేందుకు సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సిసిపిఎ) సరికొత్త మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది.

హోటల్స్‌, రెస్టారెంట్‌లలో సర్వీస్‌ ఛార్జీల పేరిట కస్టమర్ల నుంచి బలవంతపు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. బిల్లులకు ఆటోమేటిక్‌గా కానీ, మ్యానువల్‌గా కానీ సర్వీస్‌ ఛార్జీలను జత చేయొద్దని సీసీపీఏ తన గైడ్‌లైన్స్‌లో పేర్కొంది.

సర్వీస్‌ ఛార్జీలను ఏ రూపేనా కూడా వసూలు చేయడానికి వీల్లేదు. కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేయరాదు. అది కేవలం స్వచ్ఛంద చెల్లింపు, ఆప్షనల్‌ మాత్రమే. ఈ విషయాన్ని కస్టమర్‌కు సైతం తెలియజేయాలని మార్గదర్శకాల్లో కన్జూమర్‌ ఎఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ మినిస్ట్రీ స్పష్టం చేసింది.

ఫుడ్‌ బిల్లు, జీఎస్టీతో పాటు సర్వీస్‌ ఛార్జ్‌ అనేది బిల్లులో ఇకపై కనిపించడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా హోటల్‌, రెస్టారెంట్‌ గనుక సర్వీస్‌ఛార్జ్‌ వసూలు చేస్తే గనుక.. నిబంధనలను ఉల్లంఘించినట్లేనని తాజా మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. ఈ విషయమై ప్రశ్నించే.. నిలదీసే హక్కు కస్టమర్లకు ఉంటుందని తెలిపింది.

ఫిర్యాదు చేయాలనుకుంటే.. నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1915కు కాల్‌ చేయాలని తెలిపింది. లేదంటే ఎన్‌సీహెచ్‌ మొబైల్‌ యాప్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది. సీపీపీఏకు ఈ-మెయిల్‌  ccpa@nic.in ద్వారా కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చని తెలిపింది.

అంతేకాదు అన్‌ఫెయిర్‌ ట్రేడ్‌ ప్రాక్టిస్‌ కింద కన్జూమర్‌ కమిషన్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ వేగవంతమైన చర్యల కోసం.. ఈ-దాఖిల్‌ పోర్టల్‌ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఇవేం కుదరకుంటే.. నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందిస్తే.. సీసీపీఏ సమన్వయం ద్వారా దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేసింది.