గోధ్రా రైలు దహనం కేసులో కీలక నిందితుడికి జీవిత ఖైదు

దేశవ్యాప్తంగా 2002లో సంచలన సృష్టించిన గోద్రా రైలు దహనం కేసులో ప్రధాన నిందితుడైన రఫీక్ భతూక్‌కు జైవిత ఖైదు పడింది. పంచమహల్ జిల్లాలోని గోద్రా అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఈ తాజా తీర్పు వెలువరించారు. 2021 ఫిబ్రవరిలో రఫీక్ అరెస్టయ్యాడు. అనంతరం అతనిపై విచారణ వేగవంతం చేశారు.

గోద్రా రైలు దహనం కేసు వివరాల ప్రకారం, 2002 ఫిబ్రవరి 27న కరసేవకులతో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న రైలుకు గోద్రా స్టేషన్‌లో దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 59 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్‌లో మత ఘర్షణలకు దారితీసి 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ కేసులో దోషిగా శిక్షపడిన 35వ హంతుకుడు రఫీక్ భతూక్. గత ఏడాది ఫిబ్రవరిలో గోద్రా టౌన్‌లోని ఒక ప్రాతంలో భతూక్‌ను పంచమహల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడుగా తన పేరు బయటక రావడంతో అప్పట్లో గోద్రాను వదిలి అతను పారిపోయాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ గత ఏడాది తిరిగి గోద్రాకు వచ్చాడు.

దీనికి ముందు, 2011 మార్చి 1న ఈ కేసులో 31 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక సిట్ కోర్టు తీర్పు చెప్పింది. వారిలో 11 మందికి మరణశిక్ష విధించగా, 20 మందికి జీవిత ఖైదు విధించింది. మరణశిక్షను యవజ్జీవ శిక్షగా 2017 అక్టోబర్‌లో గుజరాత్ హైకోర్టు మార్చింది. 20 మందికి విధించిన జీవిత ఖైదును మాత్రం సమర్ధించింది. ఆ తర్వాత ఈ కేసులో మరో ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించింది.