నిర్బంధంలో దాడి, దుర్భాషలు, లైంగిక వేధింపులు

ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను దూషించినందుకు అరెస్టయిన మరాఠీ నటి కేతకి చితాలే  పోలీసుల అదుపులో ఉన్నప్పుడు ఎన్‌సిపి సభ్యులు తనను దుర్భాషలాడారని వెల్లడించారు.  అన్యాయంగా తన ఇంటి నుండి తీసుకెళ్లారని, అరెస్టు వారెంట్ లేదా ముందస్తు నోటిఫికేషన్ లేకుండా జైలులో పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

తనపై దాడి చేసి కొట్టారని, నిర్బంధంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అత్యాచార యత్నం జరిపారని ఆమె ఆరోపించింది.  ఎంవిఏ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆమె విమర్శించారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కించపరిచేలా ఉన్న పద్యాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్న ఆరోపణలపై కేతకిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే 14న అరెస్టు చేయగా.. గత నెల 22న ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. 

“నన్ను  తీసుకెళ్ళారు, అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కస్టడీ చేతులు మారింది. కలంబోలి నుండి నన్ను థానే పోలీసు కస్టడీకి అప్పగించారు” అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

“అక్కడ ఉన్న ఎన్ సిపి మహిళలు నన్ను కొట్టారు. వారు విలేకరులతో పాటు దాదాపు 20 మంది గుంపుగా వచ్చారు. అయితే, విలేకరులు నన్ను వేధించలేదు. కానీ వారు (ఎన్‌సిపి కార్యకర్తలు) నాపై రంగులు విసిరారు. ఇది సిరా అని వారు చెప్పారు, కానీ అది సిరా కాదు. అది విషపూరిత నలుపు రంగు.  మన చర్మానికి చాలా హానికరం” అంటూ ఆమె పేర్కొన్నారు.

“పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు వారు ఆ రంగును నాపైకి విసిరారు. గుడ్లు విసిరారు. పోలీస్ కాంపౌండ్ లోపల పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది చట్టవిరుద్ధం, చట్టవిరుద్ధం’’ అని ఆమె వివరించారు. కాగా జైలులో తనపై బలాత్కారం కూడా జరిగిందని ఆమె ఆరోపించారు.