షిండే ప్రభుత్వం సోమవారం బలపరీక్ష

మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే  సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన శివసేన–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం సోమవారం బలపరీక్ష ఎదుర్కోనుంది. ఇందుకోసం ఆది, సోమవారాల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి షిండే సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందే కీలకమైన స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. ఆ పదవికి బీజేపీ ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ పేరు ఖాయమైంది.

కొలాబా నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన శుక్రవారం నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి తరఫున అభ్యర్థి పోటీకి దిగితే ఆదివారం ఎన్నిక జరుగుతుంది. ఎంవీఏ హయాంలో ఎన్నిసార్లు కోరినా స్పీకర్‌ ఎన్నికకు ఒప్పుకోని గవర్నర్‌ ఇప్పుడెందుకు అనుమతించారంటూ కాంగ్రెస్‌ మండిపడింది. గత ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నానా పటోలే రాజీనామా చేసినప్పటి నుంచీ స్పీకర్‌ పోస్టు ఖాళీగా ఉంది.

‘‘బాల్‌ ఠాక్రే అనుయాయుడైన శివ సైనికుడు సీఎం అయినందుకు నా తోటి ఎమ్మెల్యేలు మాత్రమే గాక మహారాష్ట్ర అంతా ఆనందంగా ఉంది’’ అని షిండే పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత గురువారం అర్ధరాత్రి గోవా తిరిగి వెళ్లారు. ఆయన శిబిరంలోని 50 మంది ఎమ్మెల్యేలు సాదర స్వాగతం పలికారు.

షిండేకు, బాల్‌ ఠాక్రేకు అనుకూల నినాదాలతో హోరెత్తించారు. గౌహతిలో 8 రోజుల క్యాంపు అనంతరం వారంతా బుధవారం రాత్రి గోవా చేరుకోవడం, గురువారం షిండే ఒక్కరే ముంబై వెళ్లి నాటకీయ పరిణామాల మధ్య సీఎం పదవి చేపట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తనపై నమ్మకముంచి ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు షిండే కృతజ్ఞతలు తెలిపారు.

‘‘నన్ను సీఎంగా అంగీకరించి ఫడ్నవీస్‌ పెద్ద మనసు చాటుకున్నారు. ఇది నిజంగా ఫడ్నవీస్‌ మాస్టర్‌స్ట్రోక్‌. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఎంతో పెద్ద మనసుండాలి. మహారాష్ట్రలో అధికారం కోసం బీజేపీ తపించిపోతోందని భావిస్తున్న వాళ్లందరికీ ఇదో కనువిప్పు’’ అని పేర్కొన్నారు. సోమవారం జరిగే బలపరీక్ష లాంఛనం మాత్రమేనని, తనకు 175 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించారు.

కాగా ఈ నెల 2,3 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీ స్పీకర్ పదవికి బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ స్పీకర్‌ పదవికి ఎన్నిక అవసరమైతే జూలై 3న నిర్వహించనున్నారు.  గత ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.
శివసేనకు చెందిన 49 మంది శాసనసభ్యుల మద్దతు షిండేకు ఉంది. అంతేగాక బిజెపికి చెందిన 106 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థ్థులు కూడా ఏక్‌నాథ్ వైపే ఉండటంతో శాసన సభలో షిండే మెజార్టీ నిరూపణ లాంఛనంగా మారనుంది. సభలో బల నిరూపణ పూర్తయిన తరువాత షిండే తన కేబినెట్ పూర్తి స్థాయిలో విస్తరించనున్నారు.