ఉదయ్‌పూర్ హంతకులకు ఐసిస్‌ స్ఫూర్తి … జైపూర్ లో ఉగ్రదాడికి యత్నం

ఉదయ్‌పూర్ నగరంలో టైలర్ హంతకులకు ఐసిస్‌తో సంబంధం ఉందని, వారు జైపూర్‌ నగరంలో ఉగ్రదాడికి కూడా ప్లాన్ చేశారని పోలీసులు చెప్పారు. ఇద్దరు నిందితులు ఉదయ్‌పూర్‌లో మరో వ్యాపారిని హత్య చేయబోతున్నట్లు వెల్లడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
మార్చి 30వతేదీన జైపూర్‌లో వరుస పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అరెస్టు చేసిన నిందితులిద్దరినీ ఢిల్లీకి తీసుకువచ్చి విచారణ జరిపి, వారి మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపనున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. నిందితులు ఐసిస్ వీడియోలను స్ఫూర్తిగా తీసుకుని హత్య చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
నిందితులిద్దరి పోస్టులు, చాట్‌లతో సహా సోషల్ మీడియాకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ఎన్‌ఐఏ బృందం సైబర్, ఫోరెన్సిక్ బృందాల సహాయం తీసుకుంటోంది. దావత్-ఎ-ఇస్లామ్‌తో వారి సంబంధాలపై కూడా విచారణ సాగుతోంది.
పాకిస్తాన్ ఆధారిత దావత్-ఎ-ఇస్లామీ ద్వారా ఐసిస్ రిమోట్ స్లీపర్ సంస్థ అయిన అల్-సుఫాతో నిందితులకు సంబంధాలున్నాయని వెల్లడైంది. ఇద్దరు నిందితుల్లో ఒకరైన మహ్మద్ రియాజ్ అత్తారి ఉదయపూర్‌లోని అల్-సుఫా అధినేత. గతంలో టోంక్ నుంచి అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాది ముజీబ్‌తో కూడా అతనికి సంబంధం ఉంది.
రియాజ్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య కేసులో రెండో నిందితుడు మహ్మద్ గౌస్‌తో కలిసి రియాజ్ ద్వేషపూరిత ప్రచారం చేశాడు.  గౌస్ 2014లో జోధ్‌పూర్ మీదుగా కరాచీకి 30 మందితో కలిసి వెళ్లి దావత్-ఎ-ఇస్లామీలో 45 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
నిందితులు పాకిస్థాన్‌లోని ఎనిమిది మొబైల్ నంబర్లతో టచ్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగనున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు ఐఎస్‌ఐఎస్ ప్రభావానికి లోనయ్యారని ప్రాథమిక విచారణలో తేలడంతో కేంద్రహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం రాత్రి నలుగురు సభ్యుల బృందాన్ని దర్యాప్తు కోసం పంపింది.
 
ఇలా ఉండగా, ఉదయపూర్ టైలర్ హత్య ఉదంతంపై పాకిస్థాన్ రాడికల్స్ ప్రశంసించిన ఘటనపై భారతదేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరంలో టైలరు తల నరికి చంపిన ఇద్దరు హంతకులను పాక్ ఇస్లామిస్ట్ రాడికల్స్  ప్రశంసించారు.పాకిస్థాన్ దేశానికి చెందిన తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ తో సంబంధం ఉన్న రాడికల్స్ సంస్థ ఉదయ్‌పూర్ టైలర్ హత్యను ఆన్‌లైన్‌లో హర్షించారు.ఉదయ్‌పూర్ నిందితులను అభినందిస్తూ సందేశాలు పంపడం వివాదాస్పదంగా మారింది.