ఫుడ్‌ డెలివరీ ఏజెంట్లు, డ్రైవర్లకూ పెన్షన్‌, పీఎఫ్‌, ఇన్సూరెన్స్‌

స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల్లో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న వారు,ఉబెర్‌, ఓలా వంటి సంస్థల డ్రైవర్ల కేటగిరీకి చెందిన గిగ్‌ వర్కర్ల(తాత్కాలిక లేదా కాంట్రాక్ట్‌ వర్కర్లు/ఉద్యోగులు)కు పెన్షన్‌, ఇన్సూరెన్స్‌, భవిష్య నిధి(పీఎఫ్‌) వంటి సదుపాయాలు కల్పించాలని నీతి ఆయోగ్‌ నిర్ణయించింది.

అంతేకాదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న గిగ్‌ వర్కర్లకు పెయిడ్‌ సిక్‌ లీవ్‌లనూ అమలు చేయాలని భావిస్తోంది. సామాజిక భద్రత-2020 కోడ్‌ ప్రకారం గిగ్‌ వర్కర్లకు వైద్య ఆరోగ్యంలో భరోసా.. యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ, రిటైర్మెంట్‌ ప్రయోజనాలను కల్పించాలంటూ కీలక సూచనలతో నీతి ఆయోగ్‌ ఓ నివేదికను సిద్ధం చేసింది.

ఈ కేటగిరీలో స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాళ్లను నిర్వహించే చిరువ్యాపారులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, రిక్షా వాలాలు, ఆటోరిక్షా డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు కూడా వస్తారు. ఈ ప్రతిపాదన అమలుకు ప్రైవేటు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఓ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు.

కరోనా కల్లోల పరిస్థితుల్లో ఈ కేటగిరీకి చెందిన చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న విషయాన్ని నీతి ఆయోగ్‌ గుర్తుచేసింది.

‘‘దేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 77 లక్షల మంది గిగ్‌ వర్కర్లు ఉన్నారు. వ్యవసాయేతర కార్మిక శక్తిలో వీరి వాటా 2.6ు. మొత్తం ఉపాధి అవకాశా ల్లో ఈ కేటగిరీ వాటా 1.5ు. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి గిగ్‌ వర్కర్ల సంఖ్య 2.35 కోట్లకు పెరగవచ్చు’’ అని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది.

కాగా.. గిగ్‌ వర్కర్లకు ప్రత్యేక భవిష్య నిధి(పీఎఫ్‌), రిటైర్మెంట్‌ ఫండ్‌(ఈపీఎస్‌ 95) వంటి సదుపాయాలు అందించే ప్రతిపాదనలపై చర్చించేందుకు వచ్చేనెల 8న ఈపీఎ్‌ఫవో ధర్మకర్తల మండలి భేటీ కానుంది.