సైనిక సంస్కరణలతో భాగంగా త్రివిధ సైనిక దళాలను ఒకే కూటమిగా తీసుకొచ్చి సర్వీసుల ఏకీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్మీ , నేవీ, ఎయిర్ ఫోర్స్ లకు ఒకే చట్రం కిందకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న చర్చలలో కచ్చితమైన పురోగతి సాధించగలమని ఎయిర్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌదరి తెలిపారు.
త్రివిధ సర్వీసుల ఏకీకరణకు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కట్టుబడి ఉందను ఆయన స్పష్టం చేశారు. ట్రై సర్వీస్ ఆధ్వర్యంలో దేశం మరింత పటిష్టంగా, శక్తివంతంగా భవిష్యత్తులో వచ్చే ముప్పులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
“భారత సాయుధ దళాల థియేటరైజేషన్ ప్రక్రియ చర్చల దశలో ఉంది. కొన్ని అంశాలు చర్చిస్తున్నాం. ఈ అంశంలో కచ్చితమైన పురోగతి సాధిస్తామన్న నమ్మకం ఉంది” అని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం ప్రతి థియేటర్ కమాండ్లు ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన యూనిట్లను కలిగి ఉంటాయి. అవన్నీ ఒక నిర్దిష్ట భౌగోళిక భూభాగంలో ఒక కార్యాచరణ కమాండర్ కింద భద్రతా సవాళ్లను చూసేందుకు ఒకే సంస్థగా పని చేస్తాయని ఐఎఎఫ్ చీఫ్ చౌదరి చెప్పారు.
ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు వేర్వేరుగా కమాండ్లు ఉన్నాయి. ప్రారంభంలో ఎయిర్ డిఫెన్స్ కమాండ్, మారిటైమ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు కోసం ఒక ప్రణాళికను రూపొందించారు. ఉమ్మడి నిర్మాణాల రూపకల్పనకు సంబంధించిన విస్తృత అంశాల విషయానికి వస్తే మూడు సర్వీసులు ఒకే పేజీలో ఉన్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి పేర్కొన్నారు.
సాయుధ దళాలు దేశం ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటాయని, అత్యంత ప్రభావవంతమైన, భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న మోడల్ను చేరుకుంటాయని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. థియేటర్ కమాండ్లు మూడు సేవల సామర్థ్యాలను ఏకీకృతం చేయడానికి,వాటి వనరులను సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి ప్రణాళిక చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలోని మిలిటరీ వ్యవహారాల విభాగం గత సంవత్సరం మూడు సేవలను దాని రోల్ అవుట్ కోసం థియేటరైజేషన్ ప్లాన్పై స్వతంత్ర అధ్యయనాలను నిర్వహించాలని కోరింది. గత డిసెంబరులో హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ రావత్ మరణించిన తరువాత థియేటర్ల ప్రణాళికపై చర్చలు కొంచెం మందగించాయని చౌదరి తెలిపారు.
ఇక, రాబోయే సంవత్సరాల్లో మల్టీ-డొమైన్ వార్ఫేర్లో మరింత కఠినమైన, క్రమబద్ధమైన, వాస్తవిక శిక్షణ అవసరం అని ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి తెలిపారు. అదే సమయంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పారదర్శక, సమకాలీన మానవ వనరుల విధానాలను అభివృద్ధి చేయడం ద్వారా వైమానిక యోధులందరికీ మెరుగైన పని, జీవన పరిస్థితులను అందించడానికి అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నామని వివరించారు.
More Stories
అమెరికా లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?
కాంగ్రెస్ ను వివాదంలోకి నెట్టిన శ్యామ్ పిట్రోడా
దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర